ఏపీ ప్రత్యేక హోదా అంశంపై జీవీఎల్ .. జగన్ కు వార్నింగ్ ఇస్తూ ఏమన్నారంటే
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని లేఖ రాశారు.ఇక సీఎం జగన్ కేంద్రానికి రాసిన లేఖలో విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా, ఐదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారని ఆ విషయాన్ని గుర్తు చేసుకోవాలని అన్నారు . మాటిచ్చారు నిలబెట్టుకోండి అని తన లేఖలో ప్రస్తావించారు సీఎం జగన్ . ఇక సీఎం జగన్ రాసిన లేఖపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఘాటుగా స్పందించారు. సీఎం జగన్ కు ఒకరకంగా వార్నింగ్ ఇచ్చినంత పని చేశారు .
ఒకపక్క కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని ఎప్పుడో చెప్పింది. అయినప్పటికీ జగన్ పదేపదే ప్రత్యేక హోదా ప్రస్తావన తీసుకురావటంపై స్పందించిన జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదాపై రాజకీయాలు చేయాలని చూస్తే ఈ విషయంపై గత సర్కారుకి ఎదురైన పరిస్థితే వైసీపీకి కూడా ఎదురవుతుందని ఆయన హెచ్చరించారు.
ప్రత్యేక హోదా గురించి వదిలిపెట్టాలని ఆయన సూచించారు .ప్రత్యేక హోదా సమస్యపై ఇతర రాష్ట్రాల డిమాండ్లను ప్రస్తావిస్తూ, ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడం దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఆయన అన్నారు.
హోదాకు బదులు పథకాలు, ప్రాజెక్టుల ద్వారా ఏపీకి కేంద్ర ప్రభుత్వం రూ.22 వేల కోట్ల నిధులు ఇచ్చిందని పేర్కొన్న జీవీఎల్ కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశం లేదని ఆయన క్లియర్ గా చెప్పారు. ఇక ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టి రాజధానిపై కొత్త ప్రభుత్వం కొత్త జీవో తెస్తే కేంద్రం నోటిఫై చేస్తుందని చెప్పారు. కానీ ప్రత్యేక హోదా అని ప్రజల సెంటిమెంట్ తో రాజకీయం చేస్తే ఇబ్బంది తప్పదని ఆయన వ్యాఖ్యానించారు.