అవాస్తవాల 'ఉగ్రదాడి', రాజీనామా చేస్తా: బీజేపీ నేతపై కుటుంబరావు తీవ్రవ్యాఖ్యలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పైన అవాస్తవాల ఉగ్రదాడి జరుగుతోందని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు కుటుంబ రావు మంగళవారం మండిపడ్డారు. పీడీ ఖాతాలు, యూసీల పేరుతో బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. బీజేపీ నేతల కుట్ర లక్ష్యం అదే అన్నారు. పీడీ ఖాతాల నుంచి డబ్బు మళ్లినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని, తనను అరెస్టు కూడా చేసుకోవచ్చునని సవాల్ చేశారు.
స్టింగ్ ఆపరేషన్తో తప్పుడు సర్వేలు చేసిన జీవీఎల్ చరిత్ర ఎవరికీ తెలియదని కుటుంబ రావు మండిపడ్డారు. ఆయన సంపాదన వెనుక మర్మం ఏమిటో చెబితే అందరూ మిలియనీర్లు కావొచ్చన్నారు. జీవీఎల్ అంటే.. జీ అంటే గోబెల్స్, వీ అంటే వైరస్, ఎల్ అంటే లయ్యర్ అని కుటుంబ రావు ఎద్దేవా చేశారు. గ్లోబల్ వైరస్ లయ్యర్ అవాస్తవాలు చెబుతున్నారన్నారు.
జీవీఎల్ వ్యాఖ్యలు చేస్తుంటే కోర్టులు, న్యాయమూర్తులను కూడా తప్పుపట్టేలా ఉందన్నారు. ఏ కార్పోరేషన్కు అయినా వెళ్దామని, ఏ సీఏజీని అయినా తీసుకు రావాలని, లెక్కలు తేల్చుకునేందుకు సిద్ధమని చెప్పారు. జీవీఎల్ సిద్ధమా అని ప్రశ్నించారు. లెక్కల్లో మా తప్పులు నిరూపిస్తే విచారణ చేయించుకొని జైలుకు వెళ్తా అన్నారు. రాఫెల్ ఒప్పందంలో రూ.30వేల కోట్లు తినేశారనే ఆరోపణలు వస్తున్నాయన్నారు.
ఏపీ అవాస్తవాల ఉగ్రదాడి జరుగుతోందన్నారు. రాష్ట్ర పరపతిని దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు చేపడతామన్నారు. పీడీ ఖాతాలు నోషనల్ ఖాతాలేనని, వాటిని ఖజానా కార్యాలయాల్లో తెరుస్తారని, అందులో డబ్బుండదని, ఏదైనా శాఖలో ఖర్చులకు సంబంధించిన బిల్లులు వచ్చినప్పుడు కేటాయించిన నిధుల నుంచి చెల్లింపులు చేస్తారని, అలాంటి ఈ ఖాతాల్లో వేల కోట్ల నిధులే ఉంటే రాష్ట్రం అప్పులకు వెళ్లాల్సిన అవసరమేముంటుందని ప్రశ్నించారు. జీవీఎల్ నిపుణులతో వచ్చి పరిశీలించుకోవచ్చునని చెప్పారు.
ఐటీ దాడులు నిర్వహించినప్పుడు సీజ్ చేసిన సొమ్మును పీడీ ఖాతాల్లోనే పెడతారని, అంటే వారు తినేసినట్లా అని ప్రశ్నించారు. కోర్టుల ఖాతాలన్నీ ఇవేనని అక్కడ దుర్వినియోగం చేస్తున్నారని అంటారా అని నిలదీశారు. ఒకే సంస్థలో రెండు ఖాతాలు ఉంటే ఒకదాని నుంచి మరో దాంట్లోకి నిధులు మళ్లించడాన్ని సెల్ఫ్ చెక్ అంటారనే విషయం తెలియకుండా జీవీఎల్ మాట్లాడారన్నారు.