ఏపీ నేతల్లో ఎవరికి కేంద్రమంత్రి ఛాన్స్.. జీవీఎల్ కా .. సుజనా కా ?
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని విస్తరించాలని భావిస్తున్న, బలోపేతం చేయాలని భావిస్తున్న బీజేపీ అధిష్టానం తెలంగాణ తరహా వ్యూహాన్ని ఏపీలోనూ అనుసరిస్తుంది . అందులో భాగంగా ఏపీ నుండి కేంద్ర మంత్రిని నియమించాలని బిజెపి ఆలోచనలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి కి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా అవకాశం ఇచ్చిన బీజేపీ ఏపీలో కూడా బిజెపి నాయకులలో ఒకరికి కేంద్రంలో కీలక పదవి అప్పగించి ఏపీ ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేయాలని చూస్తోంది. ఇక ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఇటీవల టిడిపి నుండి బిజెపికి పార్టీ ఫిరాయించిన నేత సుజనా చౌదరి ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
కేంద్రంలో కీలక పదవి ఇచ్చేందుకు జీవీఎల్ పేరు పరిశీలిస్తున్న అధినాయకత్వం
ఉత్తరప్రదేశ్ రాజ్యసభ నుండి జీవీఎల్ ను నామినేట్ చేసినప్పటికీ అతను ఏపీకి చెందిన వాడు కావడం, ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం కీలకంగా వ్యవహరించడం వంటి కారణాలు జివిఎల్ కు కేంద్రంలో కీలక పదవి ఇస్తే బాగుంటుంది అన్న ఆలోచనకు కారణమవుతోంది. ప్రకాశం జిల్లాకు చెందిన జీవీఎల్ కుటుంబం గుంటూరు జిల్లాలో స్థిరపడ్డారు. జీవీఎల్ నరసింహారావు గతంలో చంద్రబాబు ప్రభుత్వం పైన, పాలన పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.బీజేపీలో కీలకంగా వ్యవహరించారు . జీవీఎల్ కు అవకాశం ఇవ్వటం పైన పార్టీ నాయకులకు సైతం ఎలాంటి అభ్యంతరం లేదు .
టీడీపీని ఖాళీ చేసి బీజేపీని బలోపేతం చేసేపనిలో సుజనా చౌదరి .. రేసులో సుజనా పేరు
ఇక మరోవైపు తాజాగా రాజ్యసభ నుండి బీజేపీలోకి జంప్ ఐన నలుగురు సభ్యుల లో ఒకరైన సుజనా చౌదరి పేరు కూడా మోడీ పరిశీలిస్తున్నారు. ఎందుకంటే గతంలో మోడీ ప్రభుత్వంలో సుజనా చౌదరి సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎర్త్ సైన్స్ కోసం ఎం ఓ ఎస్ గా పనిచేశారు. కేంద్రంలోని బిజెపి అధినాయకత్వంతో సుజనా కు మొదటి నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక తాజాగా టిడిపి రాజ్యసభ సభ్యులు ఫిరాయింపు వ్యవహారంలోనూ సుజనా నే కీలకంగా వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. టిడిపి రాజ్యసభ సభ్యులైన సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేష్ లు బిజెపిలో చేరడం లో సుజనా పాత్ర ఉంది. అంతేకాదు ఎక్కువ మంది టీడీపీ నాయకులను బిజెపి లోకి తీసుకు రావడానికి సుజనా ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. దీంతో ఏపీలో పార్టీని బలోపేతం చేయడానికి సుజనా చౌదరి కీలకంగా పని చేస్తున్న నేపథ్యంలో పీఎం నరేంద్ర మోడీ, అమిత్ షా లు ఆయన పట్ల పూర్తి నమ్మకంతో ఉన్నారు.
గతంలో చేసిన ఆరోపణలు , టీడీపీ నుండి వలస నేత కావటం సుజనాకు అడ్డంకి.. మోడీ , షా ఏం చేస్తారో ?
ఇక ఈ నేపథ్యంలో సుజనా పేరును కూడా బిజెపి అగ్రనాయకత్వం పరిశీలిస్తోంది.అయితే గతంలో సుజనా చౌదరి టిడిపిలో ఉన్న సమయంలో ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు సుజనా చౌదరి, జీవీఎల్ నరసింహారావు లు. ఇక అప్పట్లో జీవీఎల్ నరసింహారావు పై సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సుజనా చౌదరి కి కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ బిజెపి అగ్రనాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఏపీలో చర్చకు కారణమవుతోంది. అంతేకాక టిడిపి నుంచి పార్టీ ఫిరాయించిన నేతకు కేంద్రంలో కీలక పదవి ఇస్తే అది చాలా కాలంగా పార్టీ లో పనిచేస్తున్న నేతల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అన్న భావన కూడా వ్యక్తమవుతోంది. మరి చూడాలి మోడీ, షాలు కేంద్రంలో ఇవ్వనున్న కీలక పదవిని సుజనా కి ఇస్తారా? లేక జివిఎల్ కు ఇస్తారా ?