కేంద్రానికి జగన్ ఓ లేఖ రాస్తే ఆ పోర్టు వచ్చే ఛాన్స్ అన్న జీవీఎల్ ..
Recommended Video
ఆంధ్రప్రదేశ్లో రామాయ పట్నం పోర్టు నిర్మాణంపై కేంద్రం చొరవ చూపాలని రాజ్యసభ సభ్యులు జివిఎల్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాజ్యసభలో ఈ అంశంపై ప్రస్తావించిన ఆయన దుగరాజపట్నం పోర్టు కు ప్రత్యామ్నాయంగా దీనిని నిర్మించాలని ప్రతిపాదించారు..ఏపీలో రామాయపట్నం పోర్టు నిర్మాణంపై ఏపీ సీఎం జగన్ ఒక లేఖ పంపిస్తే కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు.
దుగారాజపట్నం పోర్ట్ కు ప్రత్యామ్నాయంగా రామాయపట్నం పోర్టు నిర్మించాలని జీవీఎల్ ప్రతిపాదన
ఏపీ విభజన చట్టంలో దుగరాజపట్నంలో ఓడరేవు నిర్మించాలని స్పష్టంగా ఉంది . కానీ అది ఆచరణలో సాధ్యం కాదని కేంద్రం దుగరాజపట్నం పోర్టుకు ప్రత్యామ్నాయం సూచించమని గతంలోనే కోరింది. మూడేళ్ల క్రితమే ఏపీలో గత టిడిపి ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసిందని పేర్కొన్న జీవీఎల్ కేంద్ర రాసిన లేఖకు చంద్రబాబు నుండి ఎలాంటి సమాధానం రాలేదని, ఇందుకు ప్రత్యామ్నాయం సూచించాలని చంద్రబాబునాయుడిని కేంద్రం కోరినా ఆయన స్పందించలేదని విమర్శించారు. ఇక తాజాగా దుగరాజపట్నంకు ప్రత్యామ్నాయంగా రామాయపట్నంలో పెద్ద ఓడరేవు నిర్మించాలని ఈరోజు జీరో అవర్ లో తాను ప్రతిపాదించినట్టు చెప్పారు.
గత ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందించలేదన్న జీవీఎల్ .. జగన్ లేఖ రాస్తే రామాయపట్నం పోర్ట్ వచ్చే చాన్స్
రామాయపట్నంలో పెద్ద ఓడరేవు వస్తే దాదాపు రూ.50 వేల కోట్లు పెట్టుబడులుగా వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం , కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కోరాలని, అందుకు జగన్ ముందుకు రావాలని ఆయన పేర్కొన్నారు. రామాయపట్నం పోర్టు సాధించగలిగితే నెల్లూరు, ప్రకాశం ప్రాంతాల అభివృద్ధితో పాటు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఈ ప్రాజెక్టు తోడ్పడుతుందని జీవీఎల్ స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం రామాయపట్నం పోర్టు ప్రతిపాదనను విస్మరించిందని, అందుకు కారణమేంటో తెలియదని అన్నారు. రామాయపట్నంలో ఓడ రేవు నిర్మాణానికి సమ్మతమేనని చెబుతూ ఓ లేఖ ఇవ్వమని గతంలో ఏపీ ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోని కారణాలేమిటో తెలియలేదని పేర్కొన్న జీవీఎల్ ఇప్పటికైనా ఈ విషయమై జగన్ ప్రభుత్వం కేంద్రానికి ఓ లేఖ రాస్తే రామాయపట్నంలో పోర్టు నిర్మాణం తప్పనిసరిగా జరుగుతుందని చెప్పారు.
దుగరాజపట్నం పోర్ట్ కట్టి తీరుతామని జగన్ ఎన్నికల హామీ .. రామాయపట్నం పోర్టుకు లేఖ రాస్తారా ?
ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తే, కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే బాగుంటుందని, ఇందులో ఎలాంటి తప్పులేదని అభిప్రాయపడ్డారు. అయితే గత ఎన్నికల ముందు నెల్లూరు జిల్లాలో ఎన్నికల సమర శంఖారావంలో మాట్లాడిన జగన్ వైసీపీ అధికారంలోకి రాగానే దుగరాజపట్నం పోర్టు నిర్మిస్తామని, స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇక ప్రస్తుతం దుగరాజపట్నం పోర్టు బదులుగా, రామాయపట్నం పోర్టు నిర్మాణం చేపట్టాలని జీవీఎల్ చేస్తున్న ప్రతిపాదనపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.