జగన్కు విశాఖ సవాల్- రాజధానుల రిఫరెండంగా జీవీఎంసీ పోరు- వైసీపీ సత్తా చూపేనా ?
ఏపీలో మూడు రాజధానుల వ్యూహంతో రాజకీయాధికారాన్న సుస్ధిరం చేసుకోవాలని భావిస్తున్న వైసీపీ సర్కారుకు త్వరలో జరిగే విశాఖపట్నం కార్పోరేషన్ (జీవీఎంసీ) ఎన్నికలు సవాల్ విసురుతున్నాయి. ముఖ్యంగా మూడు రాజధానుల పేరుతో విశాఖలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీకి ఈ ఎన్నికలు నల్లేరు మీద నడక కాదని తేలిపోతోంది. కోర్టు కేసులతో పాటు ఇతరత్రా కారణాలతో రాజదాని తరలింపు ఆలస్యం కావడం జీవీఎంసీ ఎన్నికల మీద పెను ప్రభావం చూపించేలా కనిపిస్తోంది. దీంతో చివరి నిమిషంలో వైసీపీ నేతలు జీవీఎంసీ ఎన్నికల్లో విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ముంచుకొస్తున్న జీవీఎంసీ ఎన్నికలు
ప్రస్తుతం ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 21తో ఇది ముగియగానే 22న మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ సిద్దమవుతున్నారు. దీంతో రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న, కోర్టు కేసుల్లో లేని అన్ని మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో ఎన్నికల నగారా మోగబోతోంది. కొన్నేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ ఎన్నికల్లో ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నవి జీవీఎంసీ ఎన్నికలే. రాష్ట్రంలోనే అత్యంత పెద్దదైన గ్రేటర్ విశాఖ కార్పోరేషన్లో జరిగే ఈ ఎన్నికలు ఇప్పుడు అధికార వైసీపీతో పాటు విపక్షాలకూ ఓ సవాల్గా మారబోతున్నాయి. దీనికి ప్రధాన కారణం మూడు రాజధానుల ప్రక్రియే.
మూడు రాజధానులకు రిఫరెండమేనా ?
విశాఖ నడిబొడ్డున జరిగే ఈ పోరు వైసీపీ సర్కారు మానసపుత్రిక అయిన మూడు రాజధానులకు రిఫరెండంగా మారబోతోంది. ఎందుకంటే రాజధాని ఇచ్చినందుకు విశాఖ ప్రజలు తమను ఆదరిస్తారని వైసీపీ గంపెడాశలు పెట్టుకోగా.. విపక్షాలు కూడా రాజధాని మార్పును ప్రజలు అంగీకరించడం లేదని వాదిస్తున్నాయి. దీంతో ప్రజలు రాజధానికి మద్దతిస్తున్నారా లేక విపక్షాలు చెబుతున్నట్లు రాజధాని అక్కర్లేదా అన్నది తేలిపోనుంది. ప్రస్తుతానికి విపక్షాలు జీవీఎంసీ ఎన్నికలను మూడు రాజధానులకు రిఫరెండంగా చెబుతున్నా భవిష్యత్తులో వైసీపీ కూడా ఈ వాదనతోనే ఎన్నికల బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.
రాజధాని ఆలస్యం ప్రభావం
జీవీఎంసీ ఎన్నికలపై రాజధాని అత్యంత ఎక్కువ ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం విశాఖను రాజధాని ప్రకటించినా ఇప్పటికీ అక్కడికి తరలింపులు పూర్తి కాలేదు. కనీసం సీఎం క్యాంపు కార్యాలయం కూడా తరలించలేని పరిస్దితుల్లో వైసీపీ కనిపిస్తోంది. దీనికి కోర్టు కేసులే కారణం. కాబట్టి రాజధానే కాదు రాజధాని తరలింపు కూడా ఈ ఎన్నికలపై ప్రభావం చూపబోతోంది. రాజధాని తరలింపులో జరుగుతున్న ఆలస్యంతో విశాఖ ప్రజల్లోనూ అసంతృప్తి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. అది వైసీపీ వైఫల్యంతోనా లేక విపక్షాలు అడ్డుకోవడం వల్లా ఆనేది త్వరలో జరిగే జీవీఎంసీ ఎన్నికల ఫలితాలే చెప్పనున్నాయి.
రాజధాని తరలింపుకు ముందే జీవీఎంసీ ఎన్నికలు
రాజధానిని సాధ్యమైనంత త్వరగా విశాఖకు తరలించేందుకు వైసీపీ సర్కారు పెద్దలు శ్రమిస్తున్నా అదంత సులువు కాదని తెలుస్తూనే ఉంది. మూడు రాజధానుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో నిలిచిపోయిన విచారణ ఇంకా ప్రారంభం కాలేదు. త్వరలో విచారణ ప్రారంభమైన ఎప్పటికల్లా ముగుస్తుందో స్పష్టత లేదు. హైకోర్టు తీర్పు వెలువడినా సుప్రీంకోర్టులో దాన్ని ప్రత్యర్ధులు సవాల్ చేసే అవకాశముంది. అంతిమంగా కోర్టు కేసుల కారణంగా రాజధాని ఆలస్యం తప్పదన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. దీంతో రాజధాని తరలింపుకు ముందే ప్రభుత్వం జీవీఎంసీ ఎన్నికలను ఎదుర్కోవాల్సిన పరిస్ధితి కనిపిస్తోంది.
రాజధాని లేని ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందా ?
ఇన్నాళ్లూ రాజధాని తెచ్చామని చెప్పుకుంటూ ఓట్లు అడగొచ్చని భావించిన వైసీపీ నేతలకు తాజా పరిణామాలు మింగుడు పడటం లేదు. అసలే విశాఖ నగరంలో నాలుగు సీట్లలో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో వాసుపల్లి గణేశ్ ప్రస్తుతానికి వైసీపీకి మద్దతిస్తున్నా ఎన్నికల్లో ఎలా వ్యవహరిస్తారో తెలియడం లేదు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పరిస్ధితిని తమకు అనుకూలంగా మార్చుకోవడం వైసీపీకి కత్తిమీద సాముగా మారుతోంది. మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా నగరంలో మాత్రం టీడీపీ విజయాలు సాధించింది. దీంతో ఇప్పుడు టీడీపీ ఈ ఎన్నికల్లో సైతం గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీకి తోడు బీజేపీ-జనసేన కూడా ఈసారి పోటీలో ఉంటాయి. దీంతో ఈ ముక్కోణపు పోరులో వైసీపీ గెలుపు అంత సులువు కాదని తెలుస్తోంది.