ఇక..టీడీపీ కార్యాలయాలే టార్గెట్: డాక్యుమెంట్లు కోసం నోటీసులు జారీ : బూమ్రాంగ్ అవుతుందా..!
కరకట్ట..ప్రజావేదిక..చంద్రబాబు నివాసం..ఇప్పుడు టీడీపీ కార్యాలయం. ఏపీ ప్రభుత్వం అక్రమ కట్టడాలను ఎక్కడ ఉన్నా ఉపేక్షించవద్దని స్పష్టమైన అదేశాలు ఇచ్చింది. దీంతో..కొద్ది రోజులుగా ప్రజావేదిక కూల్చివేత పైన రాజకీయ రగడ కొనసాగుతుండగానే తాజాగా టీడీపీ కార్యాలయం పైన అధికారులు దృష్టి సారించారు. భవనానికి సంబంధించిన లీజు అగ్రిమెంట్..లింకు డాక్యుమెంట్లు తీసుకురావాలని అధికారులు సూచించారు. అయితే, అటువంటివి ఏవీ లేవు అని టీడీపీ నేతలు చెబుతున్నారు.
టీడీపీ కార్యాలయానికి నోటీసులు..
విశాఖలోని టీడీపీ కార్యాలయానికి గ్రేటర్ విశాఖ కార్పోరేషన్ నోటీసులు జారీ చేసింది. నగరంలో ఉన్న టీడీపీ భవనానికి సంబంధించిన స్థల డాక్యుమెంట్లు సమర్పించేందుకు వారం రోజులు సమయం ఇచ్చారు. లేదంటే చర్యలు తప్పవని నోటీసుల్లో పేర్కొన్నారు. దీని పైన టీడీపీ నేతలు సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. అధికారులు చెబుతున్న దాని ప్రకారం 2001లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వం నుండి పార్టీ కార్యాలయం కోసం ప్రభుత్వం నుండి రెండు వేల చదరపు గజాల భూమిని లీజుకు తీసుకున్నారు. తిరిగి టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 2016లో శాశ్వత భవనం కోసం దరఖాస్తు చేసారు. భవన నిర్మాణం తరువాత 2017 ఏప్రిల్ ఒకటి నుండి ఆస్తి పన్నును చెల్లిస్తున్నారు. అయితే, లీజు తీసుకున్న వారు వేరని...టీడీపీ భవనం నిర్మాణానికి సంబంధించిన డాక్యుమెంట్లు లేవనేది అధికారుల వాదన. దీని కోసమే తాము లింకు డాక్యుమెంట్లు కోరుతున్నామని చెబుతున్నారు.
పార్టీ నేతలు చెబుతుందేంటి..
విశాఖ టీడీపీ కార్యాలయానికి జీవీఎంసీ అధికారులు నోటీలు ఇవ్వటం పైన నగర అధ్యక్షుడు రెహమాన్ స్పందించారు. పార్టీ కార్యాలయం ఉన్న స్థలాన్ని 2001 లో ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్నామని, అప్పటి నుంచి ప్రతీ ఏడాది లీజ్ను ప్రభుత్వానికి కడుతూనే ఉన్నామని స్పష్టం చేశారు. జీవీఎంసీ అధికారులు ఇప్పుడులింక్ డాక్యుమెంట్స్ అడిగితే ఎలా ఇస్తామని ఆయన ప్రశ్నించారు. మాకు తెలిసి అది ప్రభుత్వ స్థలమేనని, దీనిపైన త్వరలోనే జీవీఎంసీ కమిషనర్ను కలుస్తామని రెహమాన్ తెలిపారు. అయితే, కార్పోరేషన్ అధికారులు నోటీసులు వారం రోజుజల్లో లీజు తీసుకున్న రాణి కమలాదేవి నుండి వారం రోజుల్లోగా లింకు డాక్యుమెంట్లు కావాలని ఈ నెల 20న నోటీసులు ఇచ్చారని ..అయితే, ఈ సమయం ముగిసింది. అయితే, టీడీపీ నేతలు మాత్రం రాణి కమలాదేవి ఎవరో తమకు తెలియదని చెబుతున్నారు.జిల్లా అధికారులే స్థలం లీజుకు ఇచ్చారని చెబుతున్నారు.
దూకుడు..బూమ్రాంగ్ అవుతుందా..
అక్రమ నిర్మాణాలను తొలిగించాల్సిన అవసరం ఉన్నా..ఇప్పుడు టీడీపీ నేతల కట్టడాలు..టీడీపీ కార్యాలయాలనే ఎంచు కోవటం ద్వారా అసలు లక్ష్యం పక్క దారి పట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రజావేదిక కూల్చివతే..చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటికి నోటీసులు ఇవ్వటం పైనే టీడీపీ నేతలు రాద్దాంతం చేస్తున్నారు. ఇది కక్ష్యపూరిత చర్యలు అంటూ ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో విశాఖలో ఇప్పటికే టీడీపీ నేతలు మురళీమోహన్..గంటా శ్రీనివాస్ వంటి వారి నిర్మాణాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పుడు టీడీపీ కార్యాలయం పైనా దృష్టి సారించారు. ఇది..విశాఖ నగరం వరకే పరిమితం అవుతుందా లేక ఇతర జిల్లాల్లోని టీడీపీ కార్యాలయాల పైనా కొనసాగుతుందా అనేది చూడాల్సి ఉంది. ప్రతీ జిల్లాలోనూ టీడీపీకి కార్యాలయాలు భారీ నిర్మాణాలే ఉన్నాయి. అక్రమ నిర్మాణాల పేరుతో ప్రభుత్వం దూకుడు జగన్కు ఇమేజ్ పెంచుతుందా..వైసీపీ ప్రభుత్వ ఆలోచనలకు బూమ్ రాంగ్ అవుతుందా చూడాలి.