తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న ఆ వైరస్ ... బాగా పెరిగిన కేసులు
ఒకపక్క చైనాను కరోనా వైరస్ వణికిస్తుంటే మరోపక్క తెలుగు రాష్ట్రాలను H1N1 వైరస్ వణికిస్తుంది. స్వైన్ ఫ్లూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో బాగా పెరుగుతుంది. శీతాకాలంలో విజృంభించే స్వైన్ ఫ్లూ వ్యాధి, ప్రస్తుతం వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల తెలుగు రాష్ట్రాల ప్రజల మీద తన ప్రభావాన్ని చూపిస్తుంది.
హైదరాబాద్లో కరోనా వైరస్ టెన్షన్ .. అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతున్న H1N1 వైరస్ కేసులు
గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోవటంతో వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. దీంతో జలుబు, దగ్గు జ్వరం ,తలనొప్పి వంటి సాధారణ జబ్బులాగే అనిపించే స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఉన్నవాళ్ళు ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మన వాతావరణంలో పూర్తిగా కలిసిపోయిన H1N1 వైరస్ తన ప్రతాపాన్ని ఇప్పటికి చూపుతోంది. ఈ ఏడాదిలో తెలుగురష్ట్రాల్లో మొత్తం 63 మంది స్వైన్ఫ్లూ బారినపడ్డారు. ఇందులో ఐదుగురు మరణించారు.
హైదరాబాద్ లో ఎక్కువగా నమోదవుతున్న స్వైన్ ఫ్లూ కేసులు
ఇక హైదరాబాద్లో చూస్తే స్వైన్ ఫ్లూ కేసులు ఇటీవల ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో ఇద్దరికి స్వైన్ ఫ్లూ చికిత్స జరుగుతుండగా మరో ఐదుగురు అనుమానితులకు పరీక్షలు జరిపారు. వాతావరణం చల్లబడితే చాలూ వైరస్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది . ఇక ఈ క్రమంలోనే తెలంగాణలో మళ్లీ స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు దాదాపు 30 మందికి స్వైన్ ఫ్లూ నిర్దారణ అయ్యింది.
రాష్ట్ర వ్యాప్తంగా 30 కేసులు
రాష్ట్ర వ్యాప్తంగా 30 కేసులు నమోదు కాగా గాంధీ, ఉస్మానియా, చెస్ట్ ఆస్పత్రుల్లో స్వైన్ ఫ్లూ లక్షణాలతో రోగులు చికిత్స పొందుతున్నారు. ఇక మరోపక్క కరోనా వైరస్ అనుమానం కూడా వేధిస్తుంది, ఇక చాలా మంది అనుమానితుల్లో కొంత మందికి స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక వరంగల్ జిల్లాకు చెందిన ఓ గర్భిణీ స్వైన్ ఫ్లూతో ఇటీవల గాంధీ ఆస్పత్రిలో చేరింది. అయితే, అనుమానిత స్వైన్ ఫ్లూ రోగులకు వైద్యులు జనరల్ వార్డులోనే చికిత్స అందిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
స్వైన్ ఫ్లూ పట్ల అప్రమత్తత అవసరం
ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళపై ఈ స్వైన్ ఫ్లూ వైరస్ ప్రతాపాన్ని చూపిస్తుంది. ఐదేళ్ల లోపు పిల్లలతోపాటు ముసలి వాళ్ళు, గర్భిణీ స్త్రీలు, ఆస్తమా రోగులు క్యాన్సర్ భారిన పడిన వాళ్ళకు స్వైన్ ఫ్లూ త్వరగా సోకుతుంది. అందుకే వీరంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. స్వైన్ ఫ్లూలో జలుబు, దగ్గు, 101, 102 డిగ్రీల జ్వరం,ఒళ్లు నొప్పులు, విరేచానాలు వంటి లక్షణాలు ఉంటాయి. వ్యాధి బారిన పడిన వారు తుమ్మినా, దగ్గినా,తగు జాగ్రత్తలు తీసుకోవాలి. శుభ్రత పాటించాలి . పౌష్టికాహారం తీసుకోవాలి .