పొంచివున్న వాయుగుండం: 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల భారీ వర్షాలు !
అమరావతి: రాబోయే 48 గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు స్థాయి నుంచి భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. ఈ మేరకు ఆ శాఖ అధికారులు సోమవారం రెండురోజుల వాతావరణ అంచనాతో కూడిన ప్రకటన విడుదల చేశారు. బంగాళాఖాతం నైరుతి ప్రాంతంలో ఈనెల 26వ తేదీన అల్పపీడనం ఏర్పడుతుందని వెల్లడించారు. క్రమంగా అది వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తర, దక్షిణ కర్ణాటక ప్రాంతాలు సహా తెలంగాణలో వర్షాలు కురుస్తాయని అన్నారు.
ఛత్తీస్గఢ్ పై 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఫలితంగా- మహారాష్ట్రలోని విదర్భ, మరఠ్వాడా ప్రాంతాల మీదుగా ఉత్తర కర్ణాటక వరకూ 900 మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించిందని చెప్పారు. దక్షిణ కర్టాటక వరకూ విస్తరించిన మరో ద్రోణి ఏర్పడబోతోందని, దీనివల్ల తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేశారు. ఆ సమయంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పారు.
ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కొమురం భీమ్ ఆసిఫాబాద్, యాదగిరి భువనగిరి, సిద్ధిపేట్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఏపీలోని రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు పడతాయని అన్నారు. సోమవారం నాడు ఏపీలో పలుచోట్ల తేలికపాటి వర్షపాతం నమోదైందని చెప్పారు. ఈ నెల 26వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన అనంతరం అది వాయుగుండంగా మారుతుందని, దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.