మండలిలో చంద్రబాబు 'మనసులోమాట' రచ్చ .... ముగ్గురు మంత్రుల మూకుమ్మడి దాడి
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. తొలిరోజే అసెంబ్లీ రచ్చ రచ్చగా మారి టిడిపి నేతల సస్పెన్షన్ కు దారి తీసింది. ఇక శాసనమండలిలోనూ రచ్చ కొనసాగింది. తుపాను పంట నష్టంపై శాసనమండలిలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. అధికార పార్టీ మంత్రులు చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. అసలు వ్యవసాయమే దండగని చంద్రబాబు అన్నారని, ఇప్పుడు రైతుల కోసం అంటూ అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై సభలో గందరగోళం నెలకొంది. బొత్సా వ్యాఖలను కొనసాగిస్తూ మంత్రి బుగ్గన , అనిల్ కుమార్ యాదవ్ కూడా మాటల దాడి చేశారు .
ఏపీ అసెంబ్లీలో మీడియాపై నిషేధం: స్పీకర్ కు చంద్రబాబు లేఖ,జగన్ కు భయమన్న అచ్చెన్న
చంద్రబాబు నాయుడు మనసులో మాట పుస్తకంలో వ్యవసాయం దండగ అని రాశారన్న బొత్సా
చంద్రబాబు నాయుడు మనసులో మాట అనే పుస్తకంలో వ్యవసాయం దండగ అని రాశారని ఆ పుస్తకం తీస్తే చంద్రబాబు వ్యవసాయం గురించి ఏం మాట్లాడారో చూపిస్తానంటూ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు చేశారు. మండలి చైర్మన్ అవకాశమిస్తే టీవీలో కూడా వేసి చూపిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇక అక్కడ మొదలైన మాటల రచ్చ మిగతా మంత్రుల దాడులతో కొనసాగింది. ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ మనసులో మాట పుస్తక ఇంట్లో ఉంటే లోకేష్ దాన్ని తీసుకువస్తే చంద్రబాబు అన్న మాటలు చూపిస్తామని స్పష్టం చేశారు .
ఆన్ లైన్ లో కూడా తొలగించారు .. నెట్ లో ఉంటే చూపించే వారం : బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
వ్యవసాయం పై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన కారణంగానే మనసులో మాట పుస్తకాన్ని మార్కెట్ లో దొరక్కుండా చేశారని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలలో తన అభిప్రాయాలతో వెలువరించిన మనసులో మాట అనే పుస్తకంలో వ్యవసాయం దండగ అని రాసుకున్నారు అని, ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని ఎద్దేవా చేశారని పేర్కొన్నారు. మనసులో మాట పుస్తకం ఆన్లైన్లో కూడా తొలగించారని, ఒకవేళ నెట్ లో ఉంటే చంద్రబాబు ఏమన్నాడో చూపించే వారిమనీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.
టీడీపీ నేతల దగ్గర ఆ దిక్కుమాలిన పుస్తకం ఉంటే తీసుకురండి : మంత్రి అనిల్ కుమార్ యాదవ్
మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా చంద్రబాబుపై తన మాటల దాడిని కొనసాగించారు . చంద్రబాబు రాసుకున్న మనసులో మాట అన్న దిక్కుమాలిన పుస్తకం తమ వద్ద లేదన్నారు టిడిపి నేతల వద్ద దిక్కుమాలిన పుస్తకం ఉంటే తీసుకురావాలన్నారు. వాళ్ల నాయకుడు రాసుకున్న గ్రంథం ఉంటే తీసుకువచ్చి చూపించాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి ఏపీలో తుఫాను పంట నష్టంపై మొదలైన రసాభాస చిలికి చిలికి గాలివానగా మారి చంద్రబాబు మనసులో మాట పుస్తకం దగ్గర ఆగింది.
మండలిలో చంద్రబాబు మనసులో మాట రచ్చ .. అయ్యప్ప మాలవేసుకున్నా సరే అనిల్ ఫైర్
మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అయ్యప్ప స్వామి మాల వేసుకుని మరీ చేసిన వ్యాఖ్యలు టిడిపి నేతలకు ఆగ్రహం తెప్పించాయి. అయ్యప్ప దీక్షలో ఉన్న వ్యక్తి శాసనమండలిలో అలా మాట్లాడడం తప్పని టిడిపి నేతలు మండిపడుతున్నారు. మొత్తానికి తొలిరోజే అటు అసెంబ్లీలోనూ , ఇటు శాసన మండలిలోనూ అధికార , ప్రతిపక్ష నేతల మధ్య మాటల రగడ చోటు చేసుకుంది . శాసన మండలిలో చంద్రబాబు మనసులో మాట రచ్చ కొనసాగుతూనే ఉంది .