చెమటోడ్చి ఉత్సాహపర్చిన బాబు, కదిలిన పవన్కళ్యాణ్
హైదరాబాద్/న్యూఢిల్లీ/విశాఖ: హుధుద్ తుఫాను బాధితులను పరామర్శిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం చెమటోడ్చారు! హుధుద్ ధాటికి కళావిహీనంగా మారిన విశాఖలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కైలాసగిరిని చంద్రబాబు గురువారం సందర్శించారు. తుఫానుకు దెబ్బతిన్న రాడర్ కేంద్రాన్ని గురించి అడిగి తెలుసుకున్నారు.
కైలాసగిరిలో జరుగుతున్న సహాయ కార్యక్రమాలలో ఆయన స్వయంగా పాల్గొన్నారు. చిందరవందరగా పడి ఉన్న చెట్లను రంపంతో కోశారు. కొమ్మలను తీసేశారు. ఆ ప్రాంతాన్ని చదును చేశారు. సాక్షాత్తూ చంద్రబాబు చెమటోడ్చడంతో సిబ్బంది రెట్టించిన ఉత్సాహంతో పని చేశారు.
నష్టం అపారం
తుఫాను ధాటికి ఏపీ తీర ప్రాంతంలో దారుణ నష్టం సంభవించింది. హుధుద్ కారణంగా 219 చోట్ల రైళ్లు, రోడ్డు మార్గాలు దెబ్బతిన్నాయి. 19 కాల్వలకు గండిపడింది. 181 పడవలు కొట్టుకుపోయాయి. 8,742 పశువులు మృతి చెందాయి. 38 మంది మృతి చెందారు. 11,318 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 12,138 విద్యుత్ స్తంభాలు నేలకూలాయి.
బాలకృష్ణ, పవన్, జగన్ పర్యటన
హుధుద్ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, వైయస్ జగన్ తదితరులు పర్యటించారు. బాలకృష్ణ గురువారం విశాఖ వెళ్తూ మార్గమధ్యలో పాయకరావుపేటలో ఆగారు. ఎమ్మెల్యే వంగలపూడి అనితతో కలిసి రైతులకు, మత్య్యకారులకు జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం సాయం అందిస్తుందని హామీ ఇచ్చారు.
రాజ్నాథ్ను కలిసిన టీడీపీ బృందం
హుధుద్ తుఫాను నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన రూ.1000 కోట్లను వెంటనే విడుదల చేయాలని టీడీపీ ఎంపీలు కంభంపాటి హరిబాబు, సీఎం రమేష్లు న్యూఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి కోరారు. రాష్ట్రానికి మరింత సాయం కూడా చేయాలన్నారు.
హుధుద్ తుఫాను నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక బృందాలను పంపాలని కోరారు. తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటించాలని రాజ్నాథ్ సింగ్ను కోరారు. ఎంపీలు విజ్ఞప్తికి హోంమంత్రి స్పందించారు. నష్టం అంచనాకు కేంద్ర బృందాలను తక్షణమే పంపిస్తామని చెప్పారు.
విరాళాలు
ఆంధ్రప్రదేశ్ సచివాలయ, అసెంబ్లీ ఉద్యోగులు తమ రెండు రోజుల జీతాన్ని తుపాను బాధితులకు విరాళంగా ఇవ్వనున్నారు. ఈ మేరకు చెక్కును చంద్రబాబుకు అందజేస్తామని ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మురళీకృష్ణ గురువారం తెలిపారు. రాజమండ్రి ఎంపీ, ప్రముఖ నటుడు మురళీ మోహన్ తుఫాను బాధితులకు రూ.25 లక్షలు ప్రకటించారు.
శ్రీజ కోరిక తీర్చనున్న పవన్ కళ్యాణ్
విశాఖలో హుధుద్ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శుక్రవారం ఖమ్మం జిల్లాలో.. తనను చూడాలనుకుంటున్న చిన్నారి శ్రీజను కలవనున్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం పవన్ కళ్యాణ్ మరోసారి వరుసగా పర్యటిస్తున్నారని చెప్పవచ్చు.
హుధుద్ పెను తుఫాను నేపథ్యంలో ఉత్తరాంధ్రలో జరిగిన అకాల నష్టం పవన్ను కదిలించింది! ఆయన బుధ, గురువారాలు విశాఖలో ఉన్నారు. ఇప్పుడు ఖమ్మం జిల్లాలలో మృత్యువుతో పోరాడుతున్న చిన్నారి తనను కలవాలని కోరుకుంటోందని మేక్ ఏ విష్ ఫౌండేషన్ తన దృష్టికి తీసుకు రావడంతో ఆయన శుక్రవారం అక్కడకు వెళ్లనున్నారు.