బాబు హామీ, తెలుగు రాష్ట్రాలపై హార్దిక్ పటేల్ కన్ను: 'కాపు'పై పావులు
లక్నో: పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ... దేశం యావత్తు తనపై దృష్టి నిలిపేలా సంచలనం సృష్టించిన హార్దిక్ పటేల్ తాజాగా బుధవారం నాడు తెలుగు రాష్ట్రాల పైన స్పందించారు. తెలుగు రాష్ట్రాల్లో కాపులను ఓబీసీల్లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కావాలని గుజరాత్ రాష్ట్రంలో హార్దిక్ పటేల్ సంచలనం అయిన విషయం తెలిసిందే. ఆయన డిమాండును మెజార్టీ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. పటేల్ సామాజిక వర్గంతో పాటు రిజర్వేషన్లు కోరుతున్న పలువురు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.
తన రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఇతర రాష్ట్రాలకు వ్యాపింప చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా, తెలుగు రాష్ట్రాల్లోని కాపులను ఓబీసీల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. తద్వారా, అన్ని రాష్ట్రాల్లో సామాజిక వర్గాలను సంఘటితం చేసేందుకు పావులు కదుపుతున్నారు.
ఇప్పటికే రిజర్వేషన్ల కోసం కుర్మీ, గుజ్జర్లు, మరాఠా, పటేళ్లను కలుపుకొని ఆయన అఖిల భారతీయ పటేల్ నవ నిర్మాణ్ సేన ఏర్పాటు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. అలాగే, ఏపీలో రిజర్వేషన్లు కోరుతున్న కాపుల మద్దతు దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు.
కాపులను ఓబీసీల్లో చేర్చాలన్న పోరాటానికి మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. తమ రిజర్వేషన్ల ఉద్యమంలో కాపులను కూడా కలుపుకొని పోతామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో కాపు సామాజిక వర్గాన్ని బిసిల్లో చేర్చుతామని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చుతామని ఆయన పలుమార్లు ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం ఎంతోకొంత టిడిపి - బిజెపికి అండగా నిలిచింది.
ఇప్పుడు హార్దిక్ పటేల్ కాపు సామాజిక వర్గానికి అండగా నిలిచేందుకు ముందుకు వస్తున్నాడు. ఇది టిడిపి, బిజెపి, జనసేన పార్టీలకు చిక్కులు తెస్తుందా అనేది చూడవలసి ఉంది. కాగా, ఇప్పటికే పలువురు కాపు సామాజిక వర్గానికి చెందిన వారి హార్దిక్ పటేల్ను కలిసినట్లుగా తెలుస్తోంది. కాపులను బిసీల్లో చేర్చే ప్రతిపాదనను బీసీ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి.