ఎన్టీఆర్కు ఇష్టమైన వ్యక్తి, చరిత్ర సృష్టించారు: దాసరికి ప్రముఖల పరామర్శ
తన తండ్రి, దివంగత ఎన్టీ రామారావుకు ప్రముఖ దర్శక, నిర్మాత దాసరి నారాయణ రావు అంటే ఎంతో ఇష్టమని ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ తెలిపారు.
హైదరాబాద్: తన తండ్రి, దివంగత ఎన్టీ రామారావుకు ప్రముఖ దర్శక, నిర్మాత దాసరి నారాయణ రావు అంటే ఎంతో ఇష్టమని ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ తెలిపారు. ఆయన శనివారం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దాసరిని పరామర్శించారు. కిమ్స్కు చేరుకుని దాసరి ఆరోగ్యపరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ.. ప్రజల ఆశీస్సులతో దాసరి నారాయణ రావు పూర్తి కోలుకున్నారని అన్నారు. ఎన్టీఆర్కు అత్యంత ఇష్టమైన దర్శకుల్లో దాసరి ఒకరని గుర్తు చేసుకున్నారు. మరో రెండు రోజుల్లో దాసరి ఇంటికి తిరిగి వస్తారని హరికృష్ణ తెలిపారు.
ఆ తర్వాత మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజు, కాంగ్రెస్ నేతలు కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి, సీపీఐ నేత నారాయణలు దాసరిని పరామర్శించారు. దాసరి పూర్తిగా కోలుకున్నారని కృష్ణం రాజు చెప్పారు. ఈ సందర్భంగా సీపీఐ నేత నారాయణ మాట్లాడుతూ.. సినీ, రాజకీయాల్లో దాసరి నారాయణ రావు చరిత్ర సృష్టించారని అన్నారు. అనేక సామాజిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారని చెప్పారు.
కళామతల్లి దాసరిని కాపాడుకుందని నారాయణ చెప్పారు. దాసరి ఆరోగ్యంగా బాగా మెరుగుపడిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి చెప్పారు. ఆయన అందరితో మాట్లాడుతున్నారని చెప్పారు. ప్రస్తుతం దాసరికి డయాలసిస్ అవసరం లేకుండానే చికిత్స అందిస్తున్నారు కిమ్స్ వైద్యులు.