తప్పు మీదే.. తేల్చండి! ఏపీకి పెండింగులో ఈ మూడే: బాబుకు హరిబాబు కౌంటర్
విజయవాడ: విభజన నేపథ్యంలో ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీల విషయంలో అధికార, విపక్షాలతో పాటు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జాయింట్ ఫ్యాక్ట్ కమిటీ చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పేందుకు ఏపీ బీజేపీ నేతలు సమావేశమయ్యారు. విజయవాడలోని హోటల్ ఐలాపురంలో బీజేపీ నేతలు భేటీ అయ్యారు. ఏపీ బీజేపీ అధ్యక్షులు హరిబాబు, పదాదికారులు, నేతలు, జిల్లా ఇంచార్జులు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.
పవన్తో కలిసి పని చేస్తానో లేదో, రాజకీయం అర్థం తెలియదు, నేనే రాజకీయాలు చేస్తున్నా: జేపీ
ఏపీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. టీడీపీకీ, వైసీపీకి, పవన్ కళ్యాణ్కు ధీటుగా కౌంటర్ ఇచ్చే అంశంపై చర్చించారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని, ముఖ్యమైన వాటిల్లో రైల్వే జోన్, దుగరాజుపట్నం పోర్ట్, కడప స్టీల్ ప్లాంట్.. ఈ మూడు అంశాలే పెండింగులో ఉన్నాయని, వాటిపై చంద్రబాబు ప్రభుత్వంలోనే కదలిక లేదని హరిబాబు అభిప్రాయపడ్డారు.
టీడీపీ, పవన్ కమిటీలకు గట్టిగా సమాధానం చెప్పాలి
ఈ సందర్భంగా విశాఖ ఎంపీ హరిబాబు మాట్లాడారు. ఏపీ విభజన చట్టాన్ని తాము పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నామని చెప్పారు. బీజేపీపై వస్తున్న విమర్శలకు గట్టిగా సమాధానం చెప్పాలన్నారు. జాతీయ విద్యా సంస్థలకు నిధులు ఇస్తున్నామని చెప్పారు.
పెండింగులో ఈ మూడు మాత్రమే
ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని బీజేపీ నెరవేరుస్తోందని హరిబాబు అన్నారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందని ఉద్దేశ్యపూర్వకంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. దుగరాజుపట్నం పోర్ట్, విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్ మాత్రమే పెండింగులో ఉన్నాయని చెప్పారు.
గతంలో కంటే ఎక్కువే ఇచ్చింది, చట్టంలో ఇలా ఉంది
ఏపీ విషయంలో కేంద్రం గతంలో కంటే ఎక్కువే ఇచ్చిందని హరిబాబు చెప్పారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని బీజేపీ నిలబెట్టుకుందని చెప్పారు. విశాఖ రైల్వే జోన్ వంటి వాటికి అవకాశం ఉందో లేదో చెప్పాలని మాత్రమే విభజన చట్టంలో ఉందన్నారు. సాధ్యాసాధ్యాలతో సంబంధం లేకుండా హామీలు నెరవేర్చే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
కడప స్టీల్ ప్లాంటు కోసం ఓకే చెప్పారు కానీ
కడప స్టీల్ ప్లాంటుకు సానుకూలం అని కేంద్రమంత్రి చెప్పారని హరిబాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని క్లియర్ చేయాల్సిన అంశాలు ఉన్నాయని గుర్తు చేశారు. రైల్వే జోన్కు అవకాశం లేదని అధికారులు చెప్పినా ప్రత్యేక జోన్ కోసం తాము ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. త్వరలో వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. విభజన సమయంలో ఏపీ ప్రయోజనాల కోసం బీజేపీనే పోరాడిందన్నారు.
దుగరాజుపట్నం పోర్ట్, మెట్రో అంశాలపై ఇలా
ప్రత్యామ్నాయ భూమి చూపిస్తే దుగరాజుపట్నం పోర్ట్ వస్తుందన్నారు. విశాఖ జోన్ విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. పొరుగు రాష్ట్రాలతో సంప్రదింపులు జరుగుతున్నాయని హరిబాబు చెప్పారు. మెట్రో ప్రాజెక్టుల విషయంలోను కేంద్రం సానుకూలంగా ఉందని చెప్పారు. మనం ఏం చేశామో, ఏం చేస్తామో ప్రజలకు వివరించాలన్నారు. ఆర్థిక లోటు భర్తీ చేస్తున్నామన్నారు.
చంద్రబాబు, పవన్కు కౌంటర్
సమైక్య ఏపీలో అభివృద్ధిని హైదరాబాదుకు పరిమితం చేశారని, విభజన నేపథ్యంలో నష్టపోయిన ఏపీని అన్ని విధాలా ఆదుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని హరిబాబు చెప్పారు. కాగా, శనివారం కేంద్రంపై చంద్రబాబు మండిపడ్డారు. విభజన హామీలు నెరవేర్చాలని, తాను 5 కోట్ల ఆంధ్రుల తరఫున నిలదీస్తున్నానని, న్యాయం కోసం అడుగుతున్నానని, న్యాయం చేయకుంటే తీవ్ర బాధాకరమైన విషయమని కేంద్రంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే, పవన్ కళ్యాణ్ జేఎఫ్సీ కూడా కేంద్రం పైనే అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో హరిబాబు పైవిధంగా కౌంటర్ ఇచ్చారు.