ఇంత చేస్తే! మోడీపై విమర్శలా? ప్రశంస వద్దు కానీ, గుర్తించండి: హరిబాబు ఏకరువు, పవన్ కమిటీపై ఇలా
న్యూఢిల్లీ/అమరావతి: దేశంలో ఏ రాష్ట్రానికి చేయనంత సాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం చేస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ హరిబాబు చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఏ కొత్త రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని అన్నారు.
Recommended Video
అందుకే ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయించిందని అన్నారు. లక్ష కోట్ల జాతీయ రహదారులను రాష్ట్రానికి మంజూరు చేయడం జరిగిందని హరిబాబు చెప్పారు.
ప్యాకేజీకి అందుకే ఒప్పుకున్నా! పార్టీ నేతలపై ఆగ్రహం-ఎంపీలకు ప్రశంస: తేల్చేసిన చంద్రబాబు
భర్తీ చేస్తాం కానీ..
కేంద్రం మంజూరు చేసిన నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమ చేయడం జరగదని తెలిపారు. రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని, కానీ, రాష్ట్రం అడిగినంత ఇవ్వాలని బిల్లులో లేదని చెప్పారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే ఐఐఎం, ఐఐటీ, తదితర సంస్థలకు రూ.60-70కోట్లు మాత్రమే కేంద్రం ఇస్తోందని అంటున్నారని.. ఆ మొత్తాలను సంస్థల ఏర్పాటుకు మూడు నాలుగేళ్లలో ఖర్చుపెట్టాలని అన్నారు. అవసరమైతే నిధులను బడ్జెట్లో కేంద్రం మరోసారి కేటాయిస్తుందని చెప్పారు. భవన నిర్మాణాలు పూర్తి చేసేందుకు నిధులు కేంద్రమే ఇస్తుందని హరిబాబు చెప్పారు.
మిగితా రాష్ట్రాలలా కాదు..
విభజన చట్టంలో లేని విద్యా సంస్థలను కూడా మంజూరు చేశామని హరిబాబు అన్నారు. అంతేగాక, కొత్త ఆంధ్రప్రదేశ్ జూన్ 2, 2014న ఏర్పడితే.. నవంబర్ 29, 2014నే దూరదర్శన్ సంస్థను ఇచ్చామని గుర్తు చేశారు. అదే నవంబర్ 9, 2000ల సంవత్సరంలో ఏర్పడిన జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్లకు మాత్రం 2017లో డీడీని ఇవ్వడం జరిగిందని అన్నారు. ప్రత్యేక శ్రద్ధతోనే ఏపీకి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామని హరిబాబు తెలిపారు.
ఏడు జిల్లాలకు టాక్స్ ఇన్సెంటివ్స్
అంతేగాక, ఏపీలోని వెనకబడిన ఏడు జిల్లాలకు టాక్స్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నట్లు హరిబాబు తెలిపారు. సీబీడీటీ నోటికేషన్లో వెనకబడిన 7(అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం) జిల్లాల్లో పరిశ్రమలు స్థాపిస్తే 15శాతం డిప్రెషన్ అవెలన్స్, 15శాతం ప్లాంట్ అండ్ మిషనరీస్ ధరలో అలవెన్స్ ఇచ్చామని చెప్పారు.
ఇంత చేస్తే మోడీపై విమర్శలా?
దేశంలో ఏ రాష్ట్రానికి చేయని విధంగా ఏపీకి సాయం చేస్తుంటే కేంద్రాన్ని, ప్రధాని మోడీని విమర్శిస్తారా? అని హరిబాబు మండిపడ్డారు. కేంద్రం ఇస్తేనేమో తమ హక్కు అని.. ఇవ్వకుంటే.. మోడీ, బీజేపీ పామని అంటారా? అని ధ్వజమెత్తారు. ఇది చాలా తప్పు అని అన్నారు. మోడీ సహకారంతోనే కేంద్రమంత్రులు ఏపీకి సాయం చేస్తున్నారని చెప్పారు.
కేంద్ర సాయంతోనే అభివృద్ధి
కేంద్రం నుంచి వచ్చిన సాయాన్ని ఒప్పుకోవాల్సిందేనని హరిబాబు అన్నారు. స్మార్ట్ సిటీల తొలి జాబితాలో విశాఖ, కాకినాడ, తిరుపతి ఒక్కో నగరానికి సుమారు రూ. 200 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. అయినా ఏమిచ్చారని అడుగుతున్నారని అన్నారు. వివిధ రకాలుగా సాయం చేస్తున్నాం.. కావాలంటే ఇంకా అడుగుదామని చెప్పారు. కేంద్ర సహకారంతోనే ఏపీ అభివృద్ధి చెందుతోందని చెప్పారు. వైబ్రెంట్ స్టేట్గా శరవేగంగా రెండంకెల వృద్ధిరేటు సాధిస్తుందంటే.. అది కేంద్ర సహకారంతోనేనని అన్నారు. కేంద్రం చేస్తున్న సాయాన్ని పొగడకపోయినా.. గుర్తించాలన్నారు.
హోదాతో పబ్బం గడుపుకుంటున్నారు..
మరో నేత జీవీఎల్ నర్సింహారావు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదానే అభివృద్ధి అని పలు పార్టీల నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. హోదా ఉంటే చాలు ఏ సాయం అవసరం లేదని వారిని చెప్పమనండి అని అన్నారు. ప్రజల్ని మభ్యపెట్టే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్యాకేజీ కిందే కేంద్రం చేస్తోందని చెప్పారు.
పవన్ కమిటీపై నమ్మకం లేదు
ఏపీకి కేంద్ర సాయంపై మరో 18 పేజీల నోట్ శుక్రవారం ఢిల్లీలో విడుదల చేశారు. పవన్కల్యాణ్ ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీపై తమకు నమ్మకం లేదన్నారు. రాష్ట్రంలో సంస్థల ఏర్పాటుకు కమిటీలు వేసి నివేదికల ఆధారంగా కేంద్రం వాటిని ఏర్పాటు చేస్తూ వస్తోందని హరిబాబు తెలిపారు. సాధ్యంకాని వాటి విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు చెప్పారు. రైల్వేజోన్పై త్వరలోనే ప్రకటన వెలువడుతుందన్న ఆయన.. ఏపీలో టీడీపీ, వైసీపీ ఎంపీల రాజీనామా అంశాన్ని అధిష్ఠానమే చూసుకుంటుందని హరిబాబు తెలిపారు.