హరికృష్ణ ఎఫెక్ట్: బాబుపై సీనియర్ల అసంతృప్తి, 2019లో వారికి టిక్కెట్లు డౌట్?
పార్టీలో పదవులపై తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ కోసం మొదటి నుంచి పని చేస్తున్న సీనియర్లను పక్కన పెట్టారని, అలాగే పని చేయని వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం.
Recommended Video
అమరావతి: పార్టీలో పదవులపై తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ కోసం మొదటి నుంచి పని చేస్తున్న సీనియర్లను పక్కన పెట్టారని, అలాగే పని చేయని వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జూ.ఎన్టీఆర్కు బాబు సంకేతాలు, ముందుచూపు: హరికృష్ణకు కోపంవస్తే
హరికృష్ణ వద్దని ఒత్తిడి
మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణను మరోసారి పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. దీనిపై కొందరు నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. అసలు పార్టీ కోసం పని చేయని, ఇంకా చెప్పాలంటే పలు సందర్భాల్లో అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడిన హరికృష్ణను పక్కన పెట్టాలని పలువురు నేతలు.. చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారని తెలుస్తోంది.
హరికృష్ణను తీసుకోవడంతో అసంతృప్తి
హరికృష్ణను పక్కన పెట్టాలని పలువురు నేతలు చెప్పినా చంద్రబాబు ఆయనకు ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీ భవిష్యత్తును, రాజకీయ కోణం, ప్యామిలీ కోణం.. ఇలా ఎన్నో ఆలోచించి చంద్రబాబు హరికృష్ణను మరోసారి పొలిట్ బ్యూరోలో కొనసాగించారు. ఒత్తిడి చేసినా ఆయనను కొనసాగించడం పలువురు నేతల్లో అసంతృప్తిని రేపిందని అంటున్నారు.
ఏపీలో..
ఏపి టిడిపి రాష్ట్ర అధ్యక్షులుగా కళా వెంకట్రావును కొనసాగించారు. ఏడుగురు ఉపాధ్యక్షులు, ఆరుగురు ప్రధాన కార్యదర్శులు, ఏడుగురు అధికార ప్రతినిధులు, ఒక కోశాధికారి, కార్యాలయ కార్యదర్శి, 35 మంది నిర్వాహక కార్యదర్శులు, నలభై మంది కార్యదర్శులు, ఒక మీడియా కోఆర్డినేటర్, ముగ్గురు హెచ్ఆర్డి సభ్యులు కలపి మొత్తం 105 మందిని ఏపి కమిటీలో నియమించారు.
తెలంగాణలో..
తెలంగాణ టిడిపి రాష్ట్ర అధ్యక్షులుగా ఎల్ రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డిని కొనసాగించారు. వారితోపాటు పది మంది ఉపాధ్యక్షులు, 8 మంది ప్రధాన కార్యదర్శులు, 11 మంది అధికార ప్రతినిధులు, ఒక కోశాధికారి, మీడియా కమిటీ కార్యదర్శి, 34 మంది ఆర్గనైజింగ్ కార్యదర్శులు, 45 మంది కార్యదర్శులు మొత్తం 114 మంది తెలంగాణ కమిటీలో నియమించారు.
నిన్న కేబినెట్లో.. నేడు పార్టీలో
పార్టీ కోసం పని చేసిన సీనియర్లను పక్కన బెట్టి కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలోనే తమకు అన్యాయం జరిగిందని పలువురు వాపోయారు. ఇప్పుడు పార్టీ పదవుల్లోను తమకు న్యాయం జరగలేదని వాపోతున్నారు.
వారినే పక్కన పెట్టారా, ఇదో హెచ్చరికనా?
గత కమిటీల్లో ఉన్న బుచ్చయ్య చౌదరి, బండారు సత్యనారాయణ మూర్తి, కరణం బలరాం, బోండా ఉమ, గాలి ముద్దు కృష్ణమనాయుడు లాంటి సీనియర్ నాయకులను పక్కన పెట్టడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ సమయంలో అధిష్టానంపై విమర్శలు చేసిన వారిని కనీసం కమిటీల విస్తరణలో పట్టించుకోనట్లుగా ఉందంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు డౌట్ అని..
కేబినెట్ విస్తరణ సమయంలో గోరంట్ల, బోండా ఉమ తదితరులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయారాం గయారాంలకు టిడిపి వేదిక అయిందని గోరంట్ల లేఖ రాయగా, కాపుల గొంతు కోశారని బోండా విమర్శించారు. ఇలాంటి వారిని పక్కన పెట్టారని అంటున్నారు. అంతేకాదు, ఇలాంటి వారికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వడం కూడా అనుమానమేననే ప్రచారం సాగుతోంది.