హరికృష్ణ మృతి: ఏపీలో 2రోజులు సంతాపదినం, మహాప్రస్థానంలో అంత్యక్రియలు
హైదరాబాద్: నందమూరి హరికృష్ణ మృతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంతాపం తెలిపింది. రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. జాతీయ జెండాను అవతనం చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
మహాప్రస్థానంలో అంత్యక్రియలు
రేపు జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో హరికృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మసాబ్ ట్యాంక్ నుంచి ఇంటి నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. సాయంత్రం నాలుగు గంటలకు అంత్యక్రియలు పూర్తి అయ్యే అవకాశముంది. ప్రభుత్వ అధికార లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి.
హరికృష్ణ భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఆయనను కడసారి చూసేందుకు అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తరలి వస్తున్నారు. హరికృష్ణ మృతితో వారంతా కన్నీరుమున్నీరు అవుతున్నారు. భౌతికకాయానికి తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ నివాళులు అర్పించారు.
హరికృష్ణ ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఇదే!
చంద్రబాబు, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్లను పలువురు పరామర్శిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ చనిపోవడం దురదృష్టకరమని కేసీఆర్ అన్నారు. చైతన్యరథయాత్రను నడిపిన కృష్ణుడిని టిడిపి కోల్పోయిందని గవర్నర్ నరసింహన్ చెప్పారు. హరికృష్ణ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలిపారు. హరికృష్ణ మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు.
సాయపడిన బెటాలియన్ సిబ్బంది
హరికృష్ణ కారు ప్రమాదానికి గురైనప్పుడు రోజు మాదిరిగా ఉదయం నడకకు వెళ్లిన బెటాలియన్ సిబ్బంది జరిగిన ప్రమాదాన్ని గుర్తించారు. హరికృష్ణ వాహనం వల్ల ప్రమాదం బారిన పడిన కారు నుంచి బయటపడిన వ్యక్తులతో పాటు బెటాలియన్ సిబ్బంది కూడా సహాయం చేశారు. కానీ హరికృష్ణ తల రోడ్డుకు బలంగా తాకడంతో రక్తస్రావం ఎక్కువైంది. దెబ్బ బలంగా తాకడం, తీవ్ర రక్తస్రావం కావడంతో హరికృష్ణ మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.