నూజివీడు నుంచి రెడీ: హరికృష్ణ, దేవినేని ఉమ కొర్రీ
వారిద్దరు బుధవారం రాత్రి చంద్రబాబును పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కలిసి ఆ మేరకు విజ్జప్తి చేసినట్లు సమాచారం. అయితే, మీరు చెప్పాల్సింది చెప్పారు, తనపై వేరే ఒత్తిడి ఉందని, ఇంకా సమయం ఉందని, వేచి చూడండని చంద్రబాబు వారితో చెప్పినట్లు తెలుస్తోంది. హిందూపురం సీటును బాలకృష్ణకు కేటాయించడంతో తనకు నూజివీడు సీటును కేటాయించాలని హరికృష్ణ చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
కాగా, నూజివీడు నుంచి పోటీ చేయాలని స్థానికంగా ఉన్న అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హరికృష్ణను కోరినట్లు తెలుస్తోంది. నూజివీడు సీటు హరికృష్ణకు కేటాయించాలనే ఆలోచన కారణంగానే చంద్రబాబు ఇంకా పెండింగులో పెట్టారని అంటున్నారు. హరికృష్ణ పోటీ చేస్తారంటూ స్థానికంగా ప్రచారం జరుగుతోంది.
తాను నూజివీడు నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, మీరు కూడా చంద్రబాబును అడగండని హరికృష్ణ స్థానిక నాయకులతో అన్నట్లు చెబుతున్నారు. చంద్రబాబును అడగంలో ఆలస్యం చేస్తున్నారని కూడా హరికృష్ణ వారితో అన్నట్లు తెలుస్తోంది. హరికృష్ణ నూజివీడు నుంచి పోటీ చేస్తారంటూ రెండు రోజులుగా ప్రచారం సాగుతోంది.