రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ పెద్ద కుమారుడు మృతి
నల్లగొండ: నందమూరి కటుంబంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లాలో శనివారం సాయంత్రం దారుణం జరిగింది. నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరాం దుర్మరణం చెందారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు కారులో బయలుదేరారు. మునగాల మండలం, ఆకుపాముల దగ్గర జాతీయ రాహదారిపై యూటర్న్ తీసుకుంటున్న ట్రాక్టర్ను, జానకిరాం ప్రయాణిస్తున్న టాటా సఫారీ(ఎపీ29బీడీ2323) బలంగా ఢీకొంది.
ఈ ప్రమాదంలో జానకిరాంకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే కోదాడ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జానకిరాం మరణించారు. ఈ ఘటనతో నందమూరి కుటుంబంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు నందమూరి హరికృష్ణ, కల్యాణ్రామ్ కోదాడకు పయనమయ్యారు.
జానకిరామ్ స్వయంగా కారు నడిపాడు. కారు నడిపే సమయంలో సీటు బెల్టు పెట్టుకోలేదని సమాచారం. జానకిరామ్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు ఉస్మానియా ఆస్పత్రికి చేరుకుంటున్నారు. జానకీరామ్కు భార్య దీపిక, కుమారులు ఎన్టీఆర్, సౌమిత్రి ఉన్నారు.
ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత ఆయన మృతదేహాన్ని హైదరాబాద్ మాసాబ్ట్యాంకులోని స్వగృహానికి తరలించనున్నారు. కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆస్పత్రికి చేరుకున్నారు. జానకిరామ్ అతనొక్కడే లాంటి సినిమాలను నిర్మించారు.
జానకీరామ్ ప్రయాణిస్తున్న కారు మూరు రౌండ్లు గుండ్రంగా తిరిగి దాదాపు 100 మీటర్ల దూరంలో ఉన్న గుంతలో పడింది. ఆ ప్రమాదంలో జానకీరామ తలకు, వెన్మెముకకు తీవ్రమైన గాయాలు అయ్యాయి.