హాట్ టాపిక్: రంగా హత్యపై జోగయ్య చంద్రబాబును ఏమన్నారు?
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు హరిరామ జోగయ్య బాంబు పేల్చారు. విజయవాడ మాజీ శాసనసభ్యుడు వంగవీటి మోహనరంగా హత్యోదంతంపై ఆయన అరవై వసంతాల నా రాజకీయ ప్రస్థానం అనే పుస్తకంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. వంగవీట రంగా హత్య వెనక చంద్రబాబు హస్తం ఉందని, చంద్రబాబు ప్రోద్బలంతోనే ఆ దారుణ హత్య జరిగిందని ఆయన ఆరోపించారు. హరిరామ జోగయ్య వ్యాఖ్యలు ఎటు దారి తీస్తాయనేది చూడాల్సి ఉంది. కానీ ఆయన చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు మాత్రం చేశారు.
ఆ గ్రంథావిష్కరణ కార్యక్రమం ఆదివారంనాడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరిగింది. 150 పేజీల పుస్తకంలో హరిరామ జోగయ్య తన రాజకీయ జీవితంలో చోటు చేసుకున్న ఎన్నో విషయాలను, వివాదాలను, విషాదాలను, మలుపులను ప్రస్తావించారు. ఈ క్రమంలోనే ఆయన తన పుస్తకంలోని 71,72,73 పేజీల్లో కాపునాడు కలతలు శీర్షికన రంగా హత్యోదంతాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు.
విజయవాడలో మహానాడు విజయవంతంగా ముగిసిన కొద్ది నెలలకే అదే ప్రాంగణంలో కాపు సామాజిక వర్గ నేతలు కాపునాడు నిర్వహించారని, లక్ష మందికిపైగా కాపు కులానికి చెందినవారు హాజరైన ఈ సభలో కాపు నాయకులు ఎన్టీఆర్ను తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారని ఆయన చెప్పారు. దాంతో కలత చెందిన ఎన్టీఆర్ తనను పిలిచి ఎందుకు మీ వాళ్లంతా నన్ను వ్యతిరేకిస్తున్నారు, కారణమేమిటని అడిగారని, దానికి సమాధానంగా తాను ఈ మధ్య కాలంలో కాపు కులస్తులకు మన ప్రభుత్వంపై కోపం రావడానికి ముఖ్య కారణం తన కులస్తుడైన విజయవాడ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగాకు భద్రతను ఉపసంహరించడమేనని చెప్పానని ఆయన తన పుస్తకంలో వివరించారు.
రంగాకు భద్రతను పునరుద్ధరిస్తే అసంతృప్తి తగ్గుతుందని చెప్పానని, ఆ సూచనను ఎన్టీఆర్ ఆమోదించి అలానే చేస్తానని చెప్పారని, కానీ మర్నాడు ఉదయం కలిసినప్పుడు సారీ జోగయ్యగారు.... మీ సలహా ప్రకారం చేయలేకపోతున్నాను, చంద్రబాబు తదితరులు ఇప్పుడే మార్పులు చేయవద్దు.. పరిస్థితి యథాతథంగా కొనసాగించడమే మంచిదని అంటున్నారని ఎన్టీఆర్ అన్నారని జోగయ్య చెప్పారు.
ఆ తర్వాత కొద్ది రోజులకు తనకు బాగా సన్నిహితుడైన అత్తిలి మాజీ శాసనసభ్యుడు దండు శివరామరాజు తనతో ఓ మాట చెప్పారని, ఇక వంగవీటి రంగా ఎన్నాళ్లో బతికేటట్టు లేడు, అతన్ని అంతమొందించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందిందని శివరామరాజు తనతో చెప్పారని , దాన్ని తాను నమ్మలేదని అన్నారు.
విజయవాడ వాస్తవ్యుడు రైల్వే కార్మిక సంఘం నాయకుడు ప్రభాకర రాజు తనకు ఈ సమాచారం ఇచ్చారని, ఆ వ్యక్తి సిరీస్ సుబ్బరాజుకు మిక్కిలి సన్నిహితుడని, తనకు కూడా బాగా సన్నిహితుడు కాబట్టి నమ్మాలని దండు శివరామరాజు తనకు చెప్పినట్లు జోగయ్య రాశారు.
విజయవాడుకు చెందిన ఒక శాసనసభ్యుడు, రైల్వే కార్మిక సంఘం నాయకుడు ప్రభాకర రాజు, కొందరు పార్టీవాళ్లతో ఎన్టీఆర్ను కలిసి రంగాను బతకనిస్తే విజయవాడలో మన పార్టీకి మనుగడ లేదని, అతన్ని అంతమొందించేందుకు తమకు అనుమతి ఇవ్వాలని ఎన్టీఆర్ను అడిగారని, అయితే ఎన్టీఆర్ తనకు ఇవన్నీ ఇష్టం ఉండవని చెప్పారని హరిరామజోగయ్య వివరించారు.
ఎన్టీఆర్ నిరాకరించడంతో వాళ్లు చంద్రబాబును, ఉపేంద్రను ఆశ్రయించారని, వాళ్లిద్దరు ప్రతిపాదనకు పచ్చజెండా ఊపారని ప్రభాకర రాజు నాతో చెప్పినట్లు శివరామరాజు తనకు చెప్పారని ఆయన అన్నారు. ఆ తర్వాత వారం రోజులకే వంగవీటి మోహనరంగా హత్య గురించి వినవలసి వచ్చిందని హరిరామజోగయ్య తన పుస్తకంలో రాశారు.
తాను ఏదైతే రాశానో దానికి కట్టుబడి ఉన్నానని హరిరామ జోగయ్య తమతో అన్నట్లు సాక్షి మీడియా రాసింది. తాను వాస్తవాలే రాశానని, ఇన్నాళ్ల తర్వాత అబద్ధం రాస్తే తనకేం వస్తుందని జోగయ్య అన్నట్లు రాసింది.
ముమ్మాటికీ ఈ పాపం చంద్రబాబుదేనని, ఇది ఇప్పుడు తాము అంటున్న మాట కాదని, హత్యకు సరిగ్గా 24 గంటలకు ముందు స్వయంగా రంగానే చంద్రబాబు అండ్ కో తన హత్యకు కుట్ర పన్నుతున్నారంటూ ప్రభుత్వానికి లేఖ రాశారని రంగా సతీమణి వంగవీటి రత్నకుమారి అన్నట్లు కూడా సాక్షి మీడియా రాసింది.