హరిరామ జోగయ్య పుస్తకం: టిడిపి వర్సెస్ బిజెపి, నేతల కీలక వ్యాఖ్యలు
అమరావతి: ఏపీలో మిత్రపక్షాలైన తెలుగుదేశం - భారతీయ జనతా పార్టీ మధ్య వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత హరిరామ జోగయ్య ఒకింత చిచ్చు రాజేసినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే కేంద్రం నుంచి సహకారం, ప్రత్యేక హోదా, ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోలు... వంటి విషయాల్లో ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.
ఇప్పుడు హరిరామ జోగయ్య కొత్త చిచ్చు పెట్టారని అంటున్నారు. రెండు రోజుల క్రితం జోగయ్య ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. అందులో పలు వివాదాస్పద అంశాలు పేర్కొన్నారని తెలుస్తోంది. ముఖ్యంగా... వంగవీటి రంగా హత్యలో చంద్రబాబు హస్తం ఉందని ఆయన చెప్పే ప్రయత్నం చేశారని అంటున్నారు.
దీనిపై టిడిపి నేతలు మండిపడుతున్నారు. జోగయ్య పుస్తకంలోనివి అన్నీ అవాస్తవాలు అని, ఆయన రాసింది నిజమే అయితే ఆనాడే ఎందుకు మాట్లాడలేదని టిడిపి నేతలు నిలదీస్తున్నారు. మరోవైపు, ఒకరిద్దరు బిజెపి నేతలు మాత్రం చంద్రబాబు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మాజీ మంత్రి, బిజెపి నేత కన్నా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ... జోగయ్య పుస్తకంలోని అంశాలపై చంద్రబాబు విచారణ జరిపించుకొని తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు పుస్తకం విడుదల కార్యక్రమానికి మాజీ కేంద్రమంత్రి, బిజెపి నేత పురంధేశ్వరి హాజరయ్యారు.
బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు తొలి నుంచి చంద్రబాబు ప్రభుత్వం పైన విరుచుకు పడుతున్నారు. ఇటీవలి కాలంలో బిజెపి కాపుల వైపు అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం బిజెపి - టిడిపి కూటమికి ఒకింత మద్దతుగా నిలిచింది.
నాడు పవన్ కళ్యాణ్ ఈ కూటమి తరఫున జోరుగా ప్రచారం చేశారు. ఇప్పుడు మిత్ర పక్షాలైన బిజెపి - టిడిపిల్లోని పలువురు నేతలు పరస్పరం బురద జల్లుకుంటున్నారు. అందుకు బిజెపి కాపులను ఆకర్షించే ప్రయత్నాలు చేయడమే కారణంగా కనిపిస్తోందని అంటున్నారు.
2019 నాటికి కాపులను తమ వైపు మళ్లించుకోవడమే లక్ష్యంగా బిజెపి పని చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. టిడిపి నేత బొండా ఉమ మంగళవారం మాట్లాడుతూ... ఓ పార్టీ ప్రయోజనం కోసం హరిరామజోగయ్య ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఉమ ఉద్దేశ్యంలో అది వైసిపియా లేక బిజెపియా తెలియాల్సి ఉంది.
మంగళవారం నాడు బిజెపి సీనియర్ నేత కావూరి సాంబశివ రావు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టిడిపి బలహీనం అవుతోందని, ప్రత్యామ్నాయం బిజెపియే అన్నారు. 2019లో బిజెపి ఏపీలో కీలకంగా ఎదుగుతుందని మొదటి నుంచి ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. బిజెపి - టిడిపిల మధ్య జోగయ్య పుస్తకం మరోసారి మాటల యుద్ధానికి తెరతీసిందని చెబుతున్నారు.