వివాదాస్పద వ్యక్తి, మంత్రి పదవి ఇవ్వలేదనే: జోగయ్యపై కళా, మోడీపై జైరాం
గుంటూరు: వంగవీటి మోహన్ రంగా హత్య కేసులో చంద్రబాబు నాయుడు హస్తం ఉందన్న హరిరామ జోగయ్య వ్యాఖ్యల పైన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావు బుధవారం నాడు మండిపడ్డారు. కాపులకు తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు.
హరిరామ జోగయ్య అవాకులు, చెవాకులు పేలకుండా ఉండేందుకు ప్రభుత్వం ఆయన పైన క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. రంగా హత్యకు తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. హరిరామ జోగయ్య ఓ వివాదాస్పద వ్యక్తి అన్నారు.
అనుచిత వ్యాఖ్యలు చేసి పుస్తకాలను సొమ్ము చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే కాపులకు సరైన ప్రాధాన్యం లభిస్తుందన్నారు. టిడిపి హయాంలో ఆయనకు మంత్రిపదవి ఇవ్వలేదని ఇష్టారీతిగా ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ప్రత్యేక హోదా హామీని మోడీ విస్మరిస్తున్నారు: జైరాం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీని ప్రధాని నరేంద్ర మోడీ విస్మరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ ఆరోపించారు. ఏపీ కాంగ్రెస్ నేతలు నిర్వహించబోయే మట్టి సత్యాగ్రాహానికి ఆశీస్సులు అన్నారు.
ఢిల్లీలో రాజ్ ఘాట్ వద్ద మహాత్ముడికి కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, రఘువీరా రెడ్డి, కేవీపీ రామచంద్రరావులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జైరాం మాట్లాడారు. చట్టంలో లేకపోయినా ఉత్తరాఖండ్కు హోదా ఇచ్చారన్నారు.
ఉప్పు సత్యాగ్రహం స్పూర్తితో మట్టి సత్యాగ్రహం నిర్వహించ తలపెట్టామని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా అన్నారు. ప్రత్యేకహోదా, విభజన చట్టంలో హామీలను సాధించేందుకు ఈ మట్టి సత్యాగ్రహం చేపడుతున్నట్టు చెప్పారు. ఈ నెల 6న నిర్వహించనున్న విస్తృత స్థాయి సమావేశంలో విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు.