ఆవిష్కరణ పురంధేశ్వరి, ఎన్టీఆర్కు అంకితం: ప్లాన్ ప్రకారమే జోగయ్య ఆత్మకథ?
హైదరాబాద్: మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య ఆత్మకథ 60 వసంతాల నా ఆత్మకథ అనే పుస్తక రచన, ఆవిష్కరణ వంటివి పథకం ప్రకారమే జరిగాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తన ఆత్మకథలో హరిరామ జోగయ్య తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆ పుస్తకాన్ని మాజీ మంత్రి, బిజెపి నేత దగ్గుబాటి పురంధేశ్వరి అదివారంనాడు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆవిష్కరించారు.
పుస్తకాన్ని హరిరామ జోగయ్య తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు అంకితమిచ్చారు. హరిరామ జోగయ్యకు సుదీర్ఘమైన రాజకీయానుభవం ఉంది. మున్సబ్ నుంచి రాష్ట్ర మంత్రి వరకు ఎదిగారు. గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు వివిధ పదవుల్లో పనిచేశారు.
హరిరామ జోగయ్య పలు రహస్యాలను, పెద్దల గోత్రాలను బయటపెట్టారు. ఇందులో తాను రాసిన కొన్ని విషయాలు ఆయనకు శత్రువులను తయారు చేసే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా చంద్రబాబుపై ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. వంగవీటి రంగా హత్య కేసులో చంద్రబాబు పాత్ర ఉందని చెప్పడానికి ఆయన తీవ్రంగానే ప్రయత్నించారు.
అటువంటి స్థితిలో పురంధేశ్వరి ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడం చర్చనీయాంశంగా మారింది. ఎన్టీ రామారావుపై తిరుగుబాటు చేసిన క్రమంలో ఆమె భర్త, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావు చంద్రబాబు వైపు ఉన్నారు. కానీ ఆ తర్వాత ఆ పార్టీలో దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఉండలేకపోయారు. ఈ స్తితిలో పురంధేశ్వరి రాజకీయ రంగ ప్రవేశం చేసి కాంగ్రెసు నుంచి పోటీ చేసి గెలిచి కేంద్ర మంత్రి కూడా అయ్యారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆమె బిజెపిలోకి వచ్చారు. తెలుగుదేశం, బిజెపి పొత్తు కారణంగా చంద్రబాబు ఎత్తుగడలో ఎన్నికల్లో ఆమె చిత్తయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఆమె విశాఖపట్నం సీటును ఆశించగా, ఆ సీటు దక్కకుండా రాజంపేట సీటు నుంచి పోటీ చేసేలా పావులు కదిపింది చంద్రబాబేనని అంటారు. రాజంపేట నుంచి పోటీ చేసి ఆమె ఓడిపోయారు.
పైగా, హరిరామ జోగయ్య కాంగ్రెసు నేత, సినీ స్టార్ చిరంజీవిపై ఆయన తీవ్రమైన ఆరోపణ చేశారు. అదే సమయంలో ఆయన తమ్ముడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ప్రశంసించారు. పవన్ కళ్యాణ్ బిజెపికి సన్నిహితంగా మెలుగుతున్న విషయం తెలిసిందే. హరిరామ జోగయ్య ఆత్మకథ రాయడం, దాన్ని ఎన్టీ రామారావుకు అంకితం ఇవ్వడం, పురంధేశ్వరి ఆవిష్కరించడం వెనక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా అనే చర్చ ప్రస్తుతం రాజకీయాల్లో సాగుతోంది.