సుప్రీం తీర్పు హర్షణీయం: హరీశ్, మళ్లీ: పయ్యావుల
హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను తిరస్కరిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత, శాసనసభ్యుడు హరీశ్రావు పేర్కొన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... సుప్రీం తీర్పుతో తెలంగాణ ఏర్పాటు న్యాయబద్దమని తేలిందని తెలిపారు.
అజ్ఞానంతోనే సీమాంధ్ర నేతలు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారని ఎద్దేవా చేశారు. సీమాంధ్ర నాయకులు ఇప్పటికైనా అధర్మ పోరాటాలు, అన్యాయ వాదనలు ఆపాలని హరీశ్రావు సూచించారు. రాష్ట్ర విభజనపై దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు తిరస్కరించిన తరుణంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడం సమంజసం కాదని చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి సీమాంధ్ర నేతలకు సూచించారు.
పిటిషన్లు కొట్టివేయలేదు: పయ్యావుల
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తాము వేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేయలేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఇది అపరిపక్వ దశ అని మాత్రమే సుప్రీం చెప్పిందని వివరించారు.
కేబినెట్ నిర్ణయం అయిన తర్వాత మరోసారి సుప్రీం కోర్టులో పిటిషన్ వేయనున్నట్లు పయ్యావుల పేర్కొన్నారు. విభజనను వ్యతిరేకిస్తూ టిడిపి నేత పయ్యావుల కేశవ్, రఘురామకృష్ణరాజు సహా 9 మంది వ్యక్తులు సుప్రీం కోర్టులో పిటిషన్లు ధాఖలు చేసిన విషయం తెలిసిందే.