బాబు ఏం చేశాడు, ఆధిపత్య పోరు: హరీష్ రావు
తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకులు ఇప్పటికీ చంద్రబాబు నాయుడే తమ నేత అని అంటున్నారని, చంద్రబాబు నాయుడు ఒక్కపనైనా చేశాడా అని హరీష్ రావు అన్నారు. తాము 67 రోజుల్లోనే చాలా పనులు చేశామని, రేపు ముఖ్యమంత్రి దళితులకు మూడు ఎకరాల భూమి ఇచ్చే పథకానికి శ్రీకారం చుడుతున్నారని ఆయన అన్నారు.
తమ మంత్రివర్గం 45 అంశాలకు పచ్చజెండా ఊపిందని, ఎన్నికల ప్రణాళికలో కూడా లేని హామీలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని ఆయన అన్నారు. ప్రతిపక్షాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు. తెలంగాణ తెలుగుదేశంలో ఆధిపత్య పోరు సాగుతోందని అన్నారు. ఆధిపత్యం కోసమే కాంగ్రెసు నాయకులు పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శల్లో అర్థం లేదని ఆయన అన్నారు. హైదరాబాదులో గవర్నర్కు అధికారాలు ఇవ్వడమంటే ఇక్కడి ప్రజలను అవమానించడమేనని ఆయన అన్నారు.
కేసీఆర్, చంద్రబాబు పరిపక్వత లేని ముఖ్యమంత్రులులాగా వ్యవహరిస్తున్నారని సిపిఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టడం మానుకోవాలని ఆయన గురువారం మీడియా సమావేశంలో అన్నారు. ఒక్క రోజు సర్వేపై ప్రజల అనుమానాలను తెలంగాణ ప్రభుత్వం నివృత్తి చేయాలని చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు వైషమ్యాలు పెంచడం మాని ప్రజాశ్రేయస్సుకోసం కృషి చేయాలని ఆయన హితవు చెప్పారు.