నారాయణ కొడుకు మృతి: అన్నీ తానైన హరీశ్ రావు, ఏపీ నేతలు, నెటిజన్లు ఇలా
నిశిత్ మరణవార్త గురించి తెలియగానే తెలంగాణ మంత్రి హరీశ్రావు దిగ్బ్రాంతి గురయ్యారు. నిశిత్ తండ్రి నారాయణ లండన్లో ఉన్నారని తెలిసి, ఆయన కుటుంబసభ్యులకు అండగా ఉండేందుకు అపోలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కొడుకు నిశిత్ మరణం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విషాదం నింపింది. చిన్న వయస్సులోనే నిశిత్, అతని స్నేహితుడు రాజా రవిచంద్ర జూబ్లీహిల్స్లో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అందర్నీ కలచి వేసింది. కాగా, నిశిత్ మరణవార్త గురించి తెలియగానే తెలంగాణ మంత్రి హరీశ్రావు దిగ్బ్రాంతి గురయ్యారు.
హరీశ్ దిగ్భ్రాంతి
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కొడుకు నిశిత్ మరణం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విషాదం నింపింది. చిన్న వయస్సులోనే నిశిత్, అతని స్నేహితుడు రాజా రవిచంద్ర జూబ్లీహిల్స్లో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అందర్నీ కలచి వేసింది. కాగా, నిశిత్ మరణవార్త గురించి తెలియగానే తెలంగాణ మంత్రి హరీశ్రావు దిగ్బ్రాంతి గురయ్యారు.
ఉదయాన్నే..
నిశిత్ తండ్రి నారాయణ లండన్లో ఉన్నారని తెలిసి, ఆయన కుటుంబసభ్యులకు అండగా ఉండేందుకు బుధవారం ఉదయాన్నే అపోలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు హరీశ్ రావు. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో.. ఉస్మానియాకు చెందిన ఫోరెన్సిక్ వైద్య నిపుణులను అపోలో ఆసుపత్రికి తీసుకు వచ్చి పోస్టుమార్టం చేయించి, మృతదేహాలను బంధువులకు అప్పగించారు.
అన్నీ తానై..
నిశిత్ మృతదేహాన్ని హెలికాప్టర్ ద్వారా నెల్లూరు తరలించేందుకు ఏవియేషన్ అధికారులతోనూ ఆయనే చర్చించారు. వాతావరణం అనుకూలించకపోవటంతో అన్ని ఏర్పాట్లతో అంబులెన్స్లో నెల్లూరు చేర్చారు. రాజారవిచంద్ర మృతదేహాన్ని అతడి స్వస్థలం ప్రకాశం జిల్లా టంగుటూరుకు పంపాలనుకున్నారు. బంధువుల సూచనతో మొదట బేగంపేటకు చేర్చారు. అనంతరం అక్కడ నుంచి టంగుటూరు పంపేందుకు ఏర్పాట్లు చేశారు.
మంత్రి చొరవకు అభినందనలు
బుధవారం ఉదయం నుంచీ అక్కడే ఉండి.. హరీశ్రావు తీసుకున్న చొరవను, మంత్రి నారాయణ కుటుంబానికి అండగా నిలిచిన తీరును ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు నేతలు కొనియాడారు. అయితే, కష్టాల్లో ఉన్నవారిని ఇలా ఆదుకోవడం హరీశ్రావుకు కొత్త కాదని, ఆపద ఎక్కడ ఉంటే హరీశ్ అక్కడ ఉంటారని అక్కడున్నవారు వ్యాఖ్యానించడం గమనార్హం. నారాయణ కుటుంబానికి హరీశ్రావు అండగా నిలిచిన తీరును నెటిజన్లు కూడా ప్రశంసించారు.
ఇంతకుముందు కూడా..
ఇటీవల సిద్దిపేటకు చెందిన ఒక మహిళకు రెండు కిడ్నీలూ పాడైనట్టు ఓ దిన పత్రికలో కథనం వస్తే.. రెండు రోజుల క్రితమే ఆయన దగ్గరుండి నిమ్స్లో చేర్పించారని, వారికి రూ.50 వేలు ఆర్థిక సాయం అందించారని తెలిసింది. 2014లో మాసాయిపేట రైలు ప్రమాదం జరిగినప్పుడు కూడా వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న హరీశ్ రావు.. చివరి మృతదేహానికి పోస్ట్మార్టం జరిపించేవరకూ అక్కడే ఉండి బాధితులకు సాయపడ్డారని గుర్తుచేసుకున్నారు. అంతేగాక, ఘటనా స్థలంలోనే హరీశ్ రావు.. మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల ఆర్థిక సాయం ప్రకటించడం గమనార్హం.
చిరంజీవితో..
ఆస్పత్రి వద్దకు చేరుకున్న సినీనటుడు, ఎంపీ చిరంజీవికి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుపుతున్న మంత్రి హరీశ్ రావు. ఇలాంటి విషాదం శత్రువు కుటుంబంలో కూడా చోటు చేసుకోకూడదని ఈ సందర్భంగా చిరంజీవి అన్నారు.
ప్రమాదానికి గురైన జర్నలిస్టుకు వెంటనే సాయం, నెల తర్వాత ఆరా
రెండున్నరేళ్ల క్రితం ‘బిజినెస్ట్ స్టాండర్డ్'కు చెందిన సుధీర్ అనే జర్నలిస్టు ఉప్పల్ బస్టాండ్లో బస్సు ఢీకొనడంతో తీవ్రగాయాలపాలయ్యారు. వెన్నెముక, పక్కటెముకలు విరిగిపోయాయి. వెంటనే సుధీర్ను కామినేని ఆత్రిలో అడ్మిట్ చేసిన పలువురు జర్నలిస్టులు.. ఆర్థిక సాయం కోసం మంత్రి కేటీఆర్ వద్దకు వెళ్లారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో మంత్రి హరీశ్ రావు వద్దకు వెళ్లారు. సుధీర్ పరిస్థితిని వివరించి రూ. 5లక్షల ఆర్థిక సాయం కావాలని జర్నలిస్టులు మంత్రిని కోరారు. వెంటనే స్పందించిన హరీశ్.. రూ.4లక్షలను తక్షణమే మంజూరు చేశారు. అంతేగాక, కామినేని ఆస్పత్రి డైరెక్టర్కు ఫోన్ చేసి బాధితుడికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. అంతేగాక, వ్యక్తిగతంగా హరీశ్ రావు రూ.20వేలను బాధితుడి కుటుంబానికి అందజేశారు. ఆ తర్వాత నెలరోజులకు గుర్తుపెట్టుకుని మరీ జర్నలిస్టులకు ఫోన్ చేసి ప్రమాదానికి గురైన బాధితుడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. హరీశ్ రావు స్పందన పట్ల సదరు జర్నలిస్టులు ఆనందం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.