పుష్కరాల్లో తొక్కిసలాట: హర్షకుమార్ దీక్ష వివాదం, కొడుకు వ్యాఖ్య!
రాజమండ్రి: గోదావరి పుష్కరాలకు మూడు రోజుల ముందు మాజీ పార్లమెంటు సభ్యుడు హర్ష కుమార్ రాజమండ్రిలో క్రైస్తవులకు స్మశాన వాటిక స్థలం కోసం నిరాహార దీక్ష చేశారు. ఇది వివాదాలకు దారి తీస్తుందని పోలీసులు పుష్కరాలకు ముందు రోజు ఆయన దీక్షను భగ్నం చేశారు.
ఆ సమయంలో హర్ష కుమార్ తనయుడు శ్రీరాజ్, కొంతమంది అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చంద్రబాబూ ఖబడ్దార్, పుష్కరాలు ఎలా జరుపుతారో చూస్తామని శ్రీరాజ్ హెచ్చరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయన వ్యాఖ్యల పైన కూడా దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది.
అయితే, ఈ వ్యాఖ్యలు చేయడం నిజమే అయినప్పటికీ, పుష్కరాలను అడ్డుకోవడం తమ ఉద్దేశ్యం కాదని శ్రీరాజ్ గురువారం విలేకరులతో చెప్పారు. తొక్కిసలాట మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. దీనిపై హైకోర్టుకు వెళ్తానని చెప్పారు. రాష్ట్రపతికి నివేదిక పంపిస్తామని చెప్పారు.
ఇదిలా ఉండగా, బుధవారం రాత్రి గోకవరం బస్టాండులో జరిగిన అగ్ని ప్రమాదం పైన అనుమానాలు ఉన్నాయని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ చెప్పారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడానని, వారు చెప్పిన ప్రకారం అక్కడ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కాలేదని, గ్యాస్ సిలిండర్లు లేవని, ఇది ప్రమాదం కాదని, దీనికి కారణాలు ఏమిటో దర్యాఫ్తులో తెలుస్తుందన్నారు. ప్రమాద కారణాలపై ఆధారాలు సేకరిస్తున్నట్లు డిజిపి తెలిపారు.