హర్షకుమార్కు 14 రోజుల రిమాండ్: సెంట్రల్ జైలుకు తరలింపు
తూర్పుగోదావరి: స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షకు దిగడంతోపాటు గాల్లోకి కాల్పులు జరిపి కలకలం రేపిన మాజీ ఎంపీ హర్షకుమార్కు రాజమండ్రి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
ఆదివారం జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో హర్షకుమార్ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించారు. తన దీక్షను భగ్నం చేసేందుకు యత్నించిన పోలీసులను హర్షకుమార్ అడ్డుకున్నారు.
తనను బలవంతంగా ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి.. తన రివాల్వర్తో గాల్లోకి నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో కూడా దీక్ష కొనసాగించిన హర్షకుమార్.. ఆ తర్వాత ఆస్పత్రి నుంచి వెళ్లిపోయారు.
అనంతరం రాజమండ్రి మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో ఆయన లొంగిపోయారు. గాల్లోకి కాల్పులు జరిపిన హర్షకుమార్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, కోర్టులో హాజరుపర్చారు. కాగా, హర్ష కుమార్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు హర్షకుమార్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.