తొక్కిసలాటపై హర్షకుమార్ వైపు..!: బోయపాటికేం పని: హర్ష కొడుకు
హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన పైన తాను హైకోర్టుకు వెళ్తానని మాజీ పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ తనయుడు శ్రీరాజ్ గురువారం నాడు చెప్పారు.
అధికారులు, పోలీసుల వైఫల్యం వల్లే రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాట జరిగిందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్, దర్శకులు బోయపాటి శ్రీనిల పైన కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాజమండ్రిలో తొక్కిసలాట హర్షకుమార్ వర్గం కుట్ర అని మంత్రులు చేసినట్లుగా వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. పుష్కరాల ఏర్పాట్లలో ప్రభుత్వం విఫలమైందన్నారు. తొక్కిసలాటపై సమగ్ర విచారణ జరపాలన్నారు.
సెంట్రల్ జైలులో ఉండి కనీసం ఫోన్ కూడా లేని మాట్లాడలేని స్థితిలో ఉన్న తన తండ్రిపై అబాండాలు సరికాదన్నారు. పుష్కరాల సమయంలో మైక్ ఐ అండ్ పీఆర్ లేదా పోలీసుల చేతిలో ఉండాలన్నారు. కానీ దర్శకుడు బోయపాటి శ్రీని మైక్ పట్టుకున్న దృశ్యాలు ఛానల్సులలో ఉన్నాయన్నారు.
ఏ హోదాతో బోయపాటి మైక్ పట్టుకున్నారని ప్రశ్నించారు. తన తండ్రి హర్షకుమార్ను అరెస్టు చేసిన విధానం సరికాదన్నారు.దీక్ష చేస్తున్న 36 గంటల్లో కనీసం డాక్టర్ను కూడా పంపించలేదని, నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకెళ్లారన్నారు. చంద్రబాబుకు ఎలాంటి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ లేవన్నారు.
కుట్ర: బండారు రమేష్
పుష్కరాల వైఫల్యానికి మాజీ పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్తో పాటు కొన్ని సంఘాలు కుట్ర పన్నాయని శ్రీరామ్ సేన రాష్ట్ర అధ్యక్షులు బండారు రమేష్ సంచలన ఆరోపణలు చేశారు. రాజమండ్రి తొక్కిసలాటకు వీరు చేసిన ప్రచారమే కారణమన్నారు.
మాజీ ఎంపీ హర్షకుమార్ దీక్షను భగ్నం చేశారన్న కక్షతో కరెంటు వైర్లు తెగిపడ్డాయని పుకార్లు సృష్టించారని ఆరోపించారు. రాజమండ్రిలో బుధవారం నాడు జరిగిన అగ్ని ప్రమాద ఘటన పైన సైతం తనకు అనుమానాలున్నాయని చెప్పారు.
కాగా, గోదావరి పుష్కరాల సందర్భంగా తొలి రోజు రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో 27 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీ కేబినెట్లో మంత్రులు పీతల సుజాత, అచ్చెన్నాయుడులు విద్రోహ కోణం ఉందనే అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.