బోటులో 93 మంది ఉన్నారన్న మాజీ మంత్రి హర్షకుమార్ ... నిరూపిస్తారా అన్న మంత్రి అవంతి
కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాద ఘటనపై మాజీ మంత్రి హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి అవంతి శ్రీనివాస్ ని టార్గెట్ చేస్తూ హర్ష కుమార్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు కొత్త రచ్చ మొదలైంది . ఇప్పటివరకు బోటు ప్రమాద ఘటన జరిగిన సమయంలో బోటులో 73 మంది ప్రయాణికులు ఉన్నారు అని అధికారులు చెప్తే, హర్షకుమార్ ప్రమాద సమయంలో బోటులో 93 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పి షాకింగ్ కామెంట్స్ చేశారు.
బోటు బయటకు తియ్యంది అందుకే అన్న మాజీ మంత్రి హర్షకుమార్
బోట్ లో ప్రయాణిస్తున్న వారి సంఖ్య తక్కువ చేసి చూపుతున్నారని, కావాలనే తప్పుడు సమాచారం ఇస్తున్నారని మండిపడ్డారు మాజీమంత్రి హర్షకుమార్. బోటులో 93 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తనకు విశ్వసనీయ సమాచారం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక అంతే కాదు సోమవారం మధ్యాహ్నానికి బోటు జాడ తెలిసిందని కానీ లెక్కకు మించి మృతదేహాలు బయటపడతాయి అన్న భయంతో బోటును బయటకు తీయడం లేదని ఆయన ఆరోపణలు చేశారు.
ప్రభుత్వ అధికారులే వ్యాపారం చేస్తున్నారన్న హర్షకుమార్
గురువారం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి వెళ్లి బోటు ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన హర్షకుమార్ అవంతి శ్రీనివాస్ ను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం గా మారాయి.బోట్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపించిన హర్షకుమార్ ఇక ఈ బోటులో ఫారెస్టు, టూరిజం, ఇరిగేషన్ అధికారులు పెట్టుబడి పెట్టారని పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులే వ్యాపారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అందుకే వారు అసలు వాస్తవాలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారని ఆయన ఆరోపించారు.ఎక్కువమందితో ప్రయాణిస్తున్న బోటుకు దేవీపట్నం ఎస్సై అనుమతి లేనప్పటికీ మంత్రి అవంతి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎస్పీలకు ఫోన్లు చేయించి బోటుకు పర్మిషన్ ఇచ్చేలా చేశారని అన్నారు.
హర్షకుమార్ వ్యాఖ్యలకు మంత్రి అవంతి కౌంటర్
ఇక మాజీ మంత్రి హర్ష కుమార్ చేసిన వ్యాఖ్యలపై అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. వెంటనే కౌంటర్ ఇచ్చారు. తనపై హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బోటు అనుమతి కోసం ఏ అధికారిని తాను ఒత్తిడి చేయలేదని, హర్ష కుమార్ చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని చెప్పారు అవంతి శ్రీనివాస్.తన పై చేసిన ఆరోపణలను హర్షకుమార్ నిరూపిస్తే తాను ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పిన అవంతి శ్రీనివాస్, నిరూపించ లేకుంటే హర్షకుమార్ ఏ శిక్షకైనా సిద్ధమా అంటూ ప్రశ్నించారు.అంతేకాదు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు మంత్రి అవంతి శ్రీనివాస్.
మాజీ మంత్రి హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలతో తెరపైకి కొత్త చర్చ
బోటు ప్రమాదం పై మాజీ మంత్రి హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.నిజంగా బోటును బయటకు తీస్తే గానీ ఇంకా ఎంత మంది మృత్యువాత పడ్డారు.. బోట్ లో ప్రయాణించిన ప్రయాణికుల సంఖ్య ఎంత అనేది తెలిసే అవకాశం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బోటు మునిగిన ప్రాంతాన్ని గుర్తించినప్పటికీ బోటు ను బయటకు తీయడానికి ఇబ్బందికర పరిస్థితులు గోదావరి లో ఉన్నాయని నేవీ సిబ్బంది తెలిపారు. కాస్త వరద తగ్గిన తర్వాత బోటును బయటకు తీసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.