తెలంగాణకు 2, ఏపీకి 1 మెగా ఫుడ్ పార్క్లు: హర్సిమ్రాత్ కౌర్
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మూడు మెగా ఫుడ్ పార్క్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి హర్ సిమ్రాత్ కౌర్ మంగళవారం తెలిపారు. తెలంగాణలో రెండు, ఏపీలో ఒక పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. అన్ని దశల్లోను ఆహార వ్యర్థాలను తగ్గించేందుకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధికల్పన నిమిత్తం 2008 నుండి కేంద్ర ప్రభుత్వం ఫుడ్ పార్కుల పథకాన్ని అమలు చేస్తోంది.
దేశంలో ఇప్పటికే 42 ప్రాజెక్టులను మంజూరు చేయగా వాటిలో 25 ప్రాజెక్టుల కేటాయింపు పూర్తయింది. మరిన్ని ప్రాజెక్టులను ఏర్పాటు చేసే నిమిత్తం కేంద్రం ప్రతిపాదనలు ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రయివేటు రంగాల నుండి 72 ప్రతిపాదనలు రాగా వాటిలో 17 అర్హత సాధించినట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు చెరొకటి దక్కించుకున్నాయి. తెలంగాణలో రాగమయూరి ఆగ్రోవెట్ ప్రయివేట్ లిమిటెడ్ కూడా అర్హత పొందింది.
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో 141.03 కోట్ల రూపాయల పెట్టుబడితో రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ ఒక పార్క్ను ఏర్పాటు చేయనుండా మహబూబ్నగర్ జిల్లాలో 112.05 కోట్ల రూపాయల పెట్టుబడితో రాగమయూరి ఆగ్రోవెట్ ప్రైవేట్ లిమిటెడ్ మెగా ఫుడ్ పార్కును ఏర్పాటు చేయనుంది. ఏపీలోని కృష్ణా జిల్లాలో రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ 152.16 కోట్ల రూపాయల పెట్టుబడితో దీనిని నెలకొల్పనుంది.
కాగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరులో ఒక ఫుడ్ పార్క్ కార్యకలాపాలు సాగిస్తుండగా పశ్చిమ గోదావరి జిల్లాలో మరో ఫుడ్ పార్క్ ఏర్పాటుకు తుది అనుమతులు వెలువడ్డాయి. దేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు కొత్త ఉత్తేజం అందించే లక్ష్యంతో 17 మెగా ఫుడ్పార్క్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది.
6,000 కోట్ల రూపాయల పెట్టుబడి అవకాశాలున్న ఈ 17 మెగా పుడ్పార్కుల్లో పదింటిని ప్రైవేటు సంస్థలకు, ఏడింటిని రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు అప్పగించారు. వీటిలో 3 రెండు తెలుగు రాష్ట్రాలకు దక్కాయి. కాంట్రాక్టులు పొందిన ప్రైవేటు సంస్థల్లో అదానీ, రుచి సోయా, ఆమ్రపాలి ఉన్నాయి. పంజాబ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ర్టాల్లో ఒక్కో ఫుడ్పార్క్ ఏర్పాటుకు ఆమోదం పొందాయి. కేరళ ప్రభుత్వం రెండు ఫుడ్పార్క్ల ఏర్పాటుకు ఆమోదం పొందింది.