హథ్రాస్ గ్యాంగ్రేప్ ఘటనతో సుగాలి ప్రీతి ఉదంతం లింక్: సీబీఐ దర్యాప్తు మంచి నిర్ణయం: జనసేన
అమరావతి: హథ్రాస్ గ్యాంగ్ రేప్ ఉదంతం.. ఉత్తర ప్రదేశ్ను అట్టుడికిస్తోంది. రాజకీయ వేడి రగిల్చింది. హథ్రాస్లో 19 సంవత్సరాల దళిత యువతి నలుగురు కామాంధుల చేతుల్లో సామూహిక అత్యాచారానికి గురైన ఘటనపై ఉత్తర ప్రదేశ్లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మధ్య మినీ యుద్దమే నడుస్తోంది. అత్యాచారానికి గురై సుమారు రెండు వారాల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతూ కన్నుమూసిన బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాాంకా గాంధీ వాద్రాపై పోలీసులు దౌర్జన్యం చేయడంతో ఇది కాస్తా పతాక స్థాయికి చేరుకుంది.
సీబీఐ చేతికి హథ్రాస్ ఘటన..
ఈ పరిణామాల మధ్య హథ్రాస్ గ్యాంగ్రేప్ ఉదంతంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపిస్తామని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఈ ఘటనపై ఇప్పటికే ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ కొనసాగిస్తోంది. ఆదివారం ఉదయం సిట్ అధికారులు బాధితురాలి నివాసానికి వెళ్లారు. వారి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. తాజాగా సీబీఐతో దర్యాప్తు చేయిస్తామంటూ యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఈ కేసును సీబీఐకి బదలాయించడానికి అవసరమైన ఆదేశాలు ఇంకా వెలువడాల్సి ఉంది.
స్వాగతించిన జనసేన పార్టీ..
హథ్రాస్ ఉదంతాన్ని సీబీఐకి అప్పగించడాన్ని జనసేన పార్టీ స్వాగతించింది. సీబీఐకి అప్పగించడం ద్వారా యోగి ఆదిత్యనాథ్ సరైన నిర్ణయాన్ని తీసుకున్నారని భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటన విడుదల చేశారు. సీబీఐ విచారణ ద్వారా దోషులకు సరైన శిక్ష పడుతుందని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ఆడబిడ్డలపై అత్యాచారం వంటి అత్యంత పైశాచిక, అమానవీయ ఘటనలు చోటు చేసుకున్నప్పుడు కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ గళం విప్పాల్సి ఉంటుందని తాము కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
సుగాలి ప్రీతి కేసుపైనా..
ఆడపిల్లలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవించేలా భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఈ సమాజంపై ఉందని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆ తరహా వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఈ దిశగా గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏపీలో కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి బాలిక మరణించిన ఘటనలో తాము ముందు నుంచీ న్యాయం కోసం పోరాడుతున్నామని అన్నారు. సమాజంలో కదలికను తీసుకుని రాగలిగామని చెప్పారు. తాము చేసిన పోరాటాలకు ప్రభుత్వం స్పందించిందని, ఈ కేసును సీబీఐకి అప్పగించిందని గుర్తు చేశారు.
Recommended Video
పార్లమెంట్, అసెంబ్లీలో చర్చకు..
సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించినట్లు ప్రభుత్వం ప్రకటించిందే తప్ప.. ఈ కేసుపై ఇంతవరకూ కేంద్ర దర్యాప్తు సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదని, అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవ తీసుకోవాలని, జోక్యం చేసుకోవాలని అన్నారు. సుగాలి ప్రీతి కుటుంబానికి జరిగిన అన్యాయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు పార్లమెంట్లో తమ గళాన్ని వినిపించాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. శాసనసభలోనూ ఈ దారుణ ఘటనపై సమగ్ర చర్చ జరగాలని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని ప్రస్తావించాలని అన్నారు. సుగాలి ప్రీతి కేసుకు జాతీయ మీడియా ప్రాధాన్యత ఇవ్వాలని, దోషులకు శిక్ష పడేలా కృషి చేయాలని చెప్పారు.