లీడర్ అనిపించుకున్న వైఎస్ జగన్... నరసన్నపేట పర్యటనలో సీఎం చేసిన పనికి హ్యాట్సాఫ్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లీడర్ అని నిరూపించుకున్నారు. నిత్యం అనేక కార్యక్రమాలలో బిజీగా ఉండే జగన్మోహన్ రెడ్డి అంత బిజీ షెడ్యూల్ లోనూ ఓ చిన్నారి కోసం తన మంచి మనసు చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డి చూపించిన ఔదార్యం అందరూ ఆయనకు హ్యాట్సాఫ్ అనేలా చేసింది.
నరసన్నపేట పర్యటనలో ఓ బాలికను చూసి చలించిపోయిన సీఎం జగన్
ఇంతకు ఏం జరిగిందంటే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పర్యటన లో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనడానికి వెళుతున్న క్రమంలో ఆయనను కలవడానికి చాలామంది ప్రయత్నం చేశారు. అలా ప్రయత్నం చేసిన వారిలో ఒక బాలిక తల్లిదండ్రులు ఉన్నారు. అయితే అంత రద్దీ లోను వారిని గమనించిన సీఎం జగన్ వారిని పిలిచి మాట్లాడారు. ఆ బాలిక పరిస్థితిని చూసి సీఎం జగన్ చలించిపోయారు. వారి కథను అడిగి తెలుసుకున్నారు.
చిన్నారికి తలకు సంబంధించిన జబ్బు, భర్త అనారోగ్యం; జగన్ ను కలిసిన దంపతులు
రేగడి మండలం చిన్న సిర్లం గ్రామానికి చెందిన మీసాల ఇంద్రజ అనే ఏడేళ్ల బాలిక తలకు సంబంధించిన వ్యాధితో పుట్టినప్పటినుండి బాధపడుతోంది. తల్లిదండ్రులు ఆమెను ఆరోగ్యంగా చూడడం కోసం ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. దాదాపు 4 లక్షల రూపాయలు ఖర్చు చేసి మరీ చిన్నారికి ఆపరేషన్ చేయించారు.
ఇక బాలిక తండ్రి అప్పలనాయుడు కూడా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో అటు భర్తను, ఇటు చిన్నారి ని కాపాడుకోవడానికి ఇంద్రజ తల్లి కృష్ణవేణి నానా అగచాట్లు పడుతోంది. దీంతో ఆమె సామాజిక కార్యకర్త సిద్ధార్థ సహాయంతో ముఖ్యమంత్రి జగన్ ను కలవడానికి దాదాపు 100 కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి నరసన్నపేట కు వచ్చారు.
చిన్నారి వైద్యానికి జగన్ సాయం... ఆ కుటుంబానికి నెలకు 10వేల పెన్షన్
సీఎం జగన్ ను కలిసే అవకాశం కోసం ప్రయత్నం చేసి, తీవ్ర నిరాశకు గురి అవుతున్న సమయంలో ముఖ్యమంత్రి జగన్ వారిని గుర్తించి, వాహనం దిగి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని పలకరించి భయపడవద్దని సీఎం జగన్ భరోసా ఇచ్చారు. తానున్నానంటూ వారికి సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఆపై అక్కడే ఉన్న శ్రీకాకుళం కలెక్టర్ శ్రీ కేష్ లట్కర్ ను పిలిచి చిన్నారికి వైద్య సహాయం అందించాలని సూచించారు. కృష్ణవేణి కుటుంబానికి నెలకు పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఆదేశించారు. చిన్నారికి సంబంధించి చికిత్స ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడున్నా అందించాలని, అవసరమైన ఆపరేషన్లు చేయించి చిన్నారి ఆరోగ్యం మెరుగు పడేలా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు.
గతంలోనూ మంచి మనసు చాటుకున్న సీఎం జగన్..
ఇదిలా ఉంటే గతంలో కూడా సీఎం జగన్ వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన సమయంలో కోనసీమ లోనూ ఓ చిన్నారి ఆరోగ్యం కోసం, వైద్యం చేయించడం కోసం కోటి రూపాయలు మంజూరు చేసి తన మంచి మనసు చాటుకున్నారు. కోనసీమలో జగన్ పర్యటించిన సమయంలో అరుదైన వ్యాధితో బాధపడుతున్న హనీ అనే చిన్నారి పరిస్థితిని తెలుసుకున్న సీఎం జగన్ ఆ చిన్నారి వైద్యానికి కావలసిన సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇక ఇలాంటి ఉదారతను ప్రదర్శించే అనేక ఘటనలతో సీఎం జగన్ ప్రజలతో లీడర్ అనిపించుకుంటున్నారు.