జగన్ బుర్రకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..తాడేపల్లి కొంప చుట్టూ డ్రగ్స్ మాఫియా; ఘాటుగా అనిత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన పై తెలుగు మహిళా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవినీతి ఆంధ్రప్రదేశ్ గా, అరాచక ఆంధ్ర ప్రదేశ్, అత్యాచార ఆంధ్రప్రదేశ్ గా, ప్రస్తుతం డ్రగ్స్ ఆంధ్ర ప్రదేశ్ గా మార్చారని అనిత వైసీపీ ప్రభుత్వ పాలన టార్గెట్ చేశారు. గత ఎన్నికల్లో గెలిచిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నంబర్ వన్ గా నిలబెడతాం అంటే తెలుగుదేశం పార్టీ నమ్మిందని , అమాయక ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా నమ్మారని పేర్కొన్న అనిత ఇలా నేరాలలో ఆంధ్ర ప్రదేశ్ ను నెంబర్ వన్ గా మారుస్తారని అనుకో లేదన్నారు.
తాలిబన్ల కంటే దారుణమైన పాలన చేస్తున్న వైసీపీ
రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి అని, అవినీతి అక్రమాలకు ఏపీ అడ్డాగా మారుతోందని, ఇక ఇప్పుడు ప్రస్తుతం మత్తుకు కూడా ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారిందని అనిత ధ్వజమెత్తారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు, జగన్మోహన్ రెడ్డి తీరు తెలీక అమాయక ప్రజలను 2019 ఎన్నికలలో 151 వైసిపి మందను ఎమ్మెల్యేలుగా గెలిపించారని వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ లకు ఆక్రమించుకున్న తరువాత అక్కడి ప్రజలు ఇతర ప్రాంతాలకు పారిపోతున్నారు అని విన్నామని, తాలిబన్ల కంటే క్రూరమైన పాలన సాగిస్తున్న వైకాపాబన్ల రాజ్యంలో ప్రజలు ఎక్కడికి పారిపోవాలో చెప్పాలని వంగలపూడి అనిత ప్రశ్నించారు.
తాడేపల్లి కొంప నుండి బయటకు రాకుండా జగన్ పాలన
కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్టు రాష్ట్రంలో దోపిడీ సాగుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో మద్యం, ఇసుక, గంజాయి, ఎర్రచందనం, ల్యాండ్ మాఫియా రెచ్చి పోతున్నాయని ప్రస్తుతం డ్రగ్స్ స్మగ్లింగ్ తో కూడా రాష్ట్రం పరువు గంగలో కలిసింది అని అనిత అభిప్రాయపడ్డారు.
జగన్మోహన్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చున్న దగ్గరనుండి ఎలా జేబులు నింపుకోవాలి అన్న ఆలోచన చేస్తున్నారే తప్పా, ధన దాహంతో, రాష్ట్రాన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుస్తున్నారే తప్పా చేసిందేమీ లేదని వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి కొంప నుండి బయటకు రాకుండా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్న అవినీతి బుర్రకి హ్యాట్సాఫ్ చెప్పాలని అనిత జగన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
డ్రగ్స్ ను అరికట్టకుండా ప్రతిపక్షాలకు పోలీసుల హితవు .. జనాలు వెర్రి వాళ్ళా
ఆఖరికి తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన తలనీలాలను కూడా మయన్మార్ వంటి దేశాలకు అక్రమ రవాణా చేయాలని చూసిన జగన్ సర్కారు తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి, బీటెక్ చదివిన వాళ్లకు కూడా వాలంటీర్లకు అవకాశం ఇచ్చి నిరుద్యోగ యువత భవిష్యత్ ను ప్రశ్నార్థకం చేశారని వంగలపూడి అనిత మండిపడ్డారు. తాడేపల్లి సీతానగరంలో సీఎం జగన్ ఇంటికి కూతవేటు దూరంలో యువతిపై సామూహిక అత్యాచారం జరిగినప్పుడు గంజాయి బ్యాచ్ లు, బ్లేడ్ బ్యాచ్ లు తిరుగుతున్నాయని మాట్లాడిన డిజీపీ, అసలు తాడేపల్లి సమీపంలో దొరుకుతున్న డ్రగ్స్ పై దృష్టి సారించకుండా, ఇప్పుడు డ్రగ్స్ పై చర్చ జరుగుతున్న సమయంలో ప్రతిపక్షాలు అలా మాట్లాడకూడదు అని హితవు పలికితే చూసేవాళ్లు వెర్రి వాళ్ళా అంటూ ప్రశ్నించారు వంగలపూడి అనిత.
హోమ్ మినిస్టర్ సుచరిత స్క్రిప్ట్ వస్తేగానీ మాట్లాడరు
ఒకప్పుడు పబ్ లలో, ఎక్కడో మహానగరాల్లో దొరికే హెరాయిన్ వంటి డ్రగ్స్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డోర్ డెలివరీ చేసే స్థాయికి చేరుకున్నాయి అంటే ప్రభుత్వం ఓ తరాన్ని నిర్వీర్యం చేస్తోందని, యువత భవిష్యత్తును పాడు చేస్తుందని మండిపడ్డారు వంగలపూడి అనిత. రాష్ట్రం ఏమైపోయినా జగన్మోహన్ రెడ్డికి పట్టదని అనిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లి లో జగన్ ఇంటి సమీపంలో అతిపెద్ద డ్రగ్స్ రాకెట్ పట్టుబడితే ఈ రోజుకి కూడా మాట్లాడని జగన్ తీరుపై నిప్పులు చెరిగారు. హోమ్ మినిస్టర్ సుచరిత స్క్రిప్ట్ వస్తేగానీ మాట్లాడరని ఎద్దేవా చేశారు.
డ్రగ్స్ స్మగ్లింగ్ పై ప్రాధమిక దర్యాప్తు కూడా జరిపే ఇంగిత జ్ఞానం లేదా ?
డీజీపీ గౌతమ్ సవాంగ్ ను చూస్తే జాలేస్తుంది అని, జగన్మోహన్ రెడ్డిని , ఆయన ఆస్తులను, జగన్ మనుషులకు రక్షణ కల్పించటంలోనే ఆయనకు సరిపోతుందని అనిత పేర్కొన్నారు. ప్రస్తుతం డీజీపీ పరిస్థితిని చూస్తే జాలేస్తుంది అన్నారు. తాడేపల్లి ప్యాలెస్ కు తాలిబన్ల డ్రగ్స్ కు లింకేంటో చెప్పాల్సిన జగన్మోహన్ రెడ్డి, హోంమంత్రి సుచరిత సైలెంట్ గా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంపై ఎలాంటి విచారణ జరపకుండా డ్రగ్స్ తో ఏపీకి ఎలాంటి సంబంధం లేదని పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందని వంగలపూడి అనిత పేర్కొన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ స్మగ్లింగ్ పై కనీసం ప్రాథమిక విచారణ జరపాలని ఇంగితజ్ఞానం కూడా పోలీసులకు లేకుండా ఉండడం ఏపీ ప్రజల దౌర్భాగ్యం అంటూ అనిత ధ్వజమెత్తారు.
జగన్ మోహన్ రెడ్డి ఇంటి చుట్టూ వారు.. ఏ గూటి పక్షులు ఆ గూటికే
డ్రగ్స్ మాఫియా ఆంధ్రప్రదేశ్ అడ్రస్ తో కార్యకలాపాలు సాగిస్తుంటే, జి ఎస్ టి లు కడుతుంటే, ప్రభుత్వ పెద్దల, అధికారుల సపోర్టు లేదని చెప్పడం చిన్న పిల్లలకు కట్టుకథలు చెప్పినట్టేనని అనిత అభిప్రాయపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టు డ్రగ్స్ మాఫియా, జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూ భూ మాఫియా, బ్లేడ్ బ్యాచ్ లు, గంజాయి బ్యాచ్ లు, రేపిస్టులు చేరుతున్నారు అంటే ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయి అన్నట్లుగా అనిపిస్తుందని, జగన్ కూడా ఆ గూటి పక్షే అంటూ వంగలపూడి అనిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఏపీ మద్యంలో డ్రగ్స్ వాడకం .. భావి తరాల భవిష్యత్ బూడిదలో కలిపే కాలయముడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా తయారవుతున్న మద్యంలో డ్రగ్స్ వాడుతున్నారని, ఆ లిక్కర్ ఎవరు తయారు చేస్తున్నారో రాష్ట్రమంతా తెలుసనీ, జగన్ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వంగలపూడి అనిత ఆరోపించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును, భావితరాల భవిష్యత్తును ఐదేళ్లలో కాలగర్భంలో కలపడానికి కాలయముడు శ్రీకారం చుట్టాడని వంగలపూడి అనిత నిప్పులు చెరిగారు. పోలీసులపై తమకు వ్యతిరేకత లేదని, పోలీసులు వృత్తి ధర్మాన్ని విస్మరించటమే తమ అభ్యంతరమని పేర్కొన్నారు. ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాలని వంగలపూడి అనిత రాష్ట్రంలో పరిస్థితులపై ఏకరువు పెట్టారు.