జగన్ కేబినెట్ మంత్రిపై సీబీఐ దర్యాప్తు- పిటిషన్ అనుమతించిన హైకోర్టు
ఏపీలో అధికార వైసీపీ ప్రభుత్వంలో కార్మికశాఖ మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాం చిక్కుల్లో పడ్డారు. ఆయన సొంత నియోజకవర్గమైన కర్నూలులోని ఆలూరులో పేకాట మాఫియాతో ఆయనకు ఉన్న లింకులు ఇప్పటికే వివాదాస్పదమయ్యాయి. వీటితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన పలుమార్లు చెప్పినా, దీనిపై వివాదం మాత్రం కొనసాగుతూనే ఉంది.
ఈ ఏడాది ఆగస్టులో కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని మంత్రి గుమ్మనూరు జయరాం సొంత గ్రామం గుమ్మనూరులో పోలీసులు 33 మంది పేకాట రాయుళ్లను పట్టుకున్నారు. పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు వీరిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో వారు పోలీసులపై కారంపొడి చల్లుతూ ఎదురుదాడికి దిగారు. చివరికి ఎలాగోలా పరిస్ధితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు వీరిని అరెస్టు చేశారు. ఈ ఘటనలో పోలీసులు 40 వాహనాలతో పాటు 5.44 లక్షల రూపాయల నగదు కూడా సీజ్ చేశారు. వీరంతా మంత్రి అనుచరులు కావడం వల్లే పోలీసులపై దాడికి తెగబ్డడారనే ఆరోపణలు వచ్చాయి.
తనపై వచ్చిన ఆరోపణలను మంత్రి జయరాం అప్పట్లో ఖండించినా వివాదం మాత్రం సద్దుమణగలేదు. గుమ్మనూరులో పేకాట మాఫియాతో మంత్రికి ఉన్న లింకులపై విపక్షాలు కూడా విమర్శలకు దిగాయి. తాజాగా ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా సీబీఐ దర్యాప్తు చేయించాలని హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. రాష్ట్రమంత్రికి వ్యతిరేకంగా సీబీఐ దర్యాప్తు కోరడంతో ఈ పిటిషన్ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే హైకోర్టు ఈ పిటిషన్ను విచారణకు అనుమతించడంతో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది.