కొడాలి నాని దోషా,కాదా ?వాక్స్వాతంత్ర్యం తేల్చేందుకు అమికస్ క్యూరీ-హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ను ఉద్దేశించి మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యల వ్యవహారంలో నిజానిజాలు తేల్చడం హైకోర్టుకు కూడా కష్టంగా మారింది. తొలుత కొడాలి నాని చేసిన వ్యాఖ్యల ఫుటేజ్ను అడిగిన హైకోర్టు.. ఫుటేజ్ సమర్పించాక కూడా దీనిపై ఎటూ తేల్చలేకపోయింది. దీంతో కేసు రేపటికి వాయిదా పడింది. అయితే కొడాలి పిటిషన్పై విచారణ సందర్భంగా మంత్రి చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. ఈ కేసులో అసాధారణంగా హైకోర్టు అమికస్ క్యూరీని కూడా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
నిమ్మగడ్డ వర్సెస్ కొడాలి నాని వివాదం
పంచాయతీ ఎన్నికల తొలిదశ పోరులో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టిన మంత్రి కొడాలి నాని తొలుత రేషన్ వాహనాలపై వచ్చిన మీడియా కథనాల గురించి మాట్లాడారు. ఆ తర్వాత పంచాయతీ పోరులో ఎన్ని అడ్డంకులు కల్పించినా తమదే విజయమంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, నిమ్మగడ్డ, మరికొందరిపై అనుచిత వ్యాఖ్యలకు దిగారు. దీంతో నిమ్మగడ్డ సీరియస్ అయ్యారు.
ప్రెస్మీట్ ముగిసిన గంటలోపే కొడాలి నానికి నోటీసులు జారీ చేశారు. ఎన్నికలు ముగిసేవరకూ మీడియాతో మాట్లాడొద్దని, ఇంటికే పరిమితం కావాలని, ఈ దిశగా కృష్ణాజిల్లా కలెక్టర్, ఎస్పీలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీన్ని సవాల్ చేస్తూ కొడాలి హైకోర్టును ఆశ్రయించారు.
కొడాలి కేసులో బిగుసుకున్న చిక్కుముడి
మంత్రి కొడాలి నాని తనపై చేసిన వ్యాఖ్యలపై నోటీసులు జారీ చేసి వివరణ తీసుకుని మరీ చర్యలకు ఆదేశాలు ఇచ్చిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఆయన వ్యాఖ్యలను హైకోర్టులో సమగ్రంగా సమర్పించడంలో మాత్రం విఫలమయ్యారు. వీడియో ఫుటేజ్ లేకుండానే కోర్టు విచారణకు హాజరైన ఎస్ఈసీ న్యాయవాదులు, ఒకరోజు గడువిచ్చినా తెచ్చిన ఫుటేజ్తో హైకోర్టు ధర్మాసనాన్ని సంతృప్తి పర్చలేకపోయారు. అదే సమయంలో కొడాలి వ్యాఖ్యల తీవ్రత మాత్రం హైకోర్టుకు అర్ధమైంది. దీంతో ఈ కేసులో ఫుటేజ్పై మరింత లోతైన విచారణ అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది.
రంగంలోకి అమికస్ క్యూరీ
కొడాలి నాని తనపై చేసిన వ్యాఖ్యలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ సమర్పించిన ఫుటేజ్ ఆధారంగా ఓ నిర్ణయానికి రాలేకపోయిన హైకోర్టు.. అసాధారణంగా ఈ కేసులో కోర్టుకు సాయపడేందుకు అమికస్ క్యూరీ(కోర్టు సహాయకుడిని) నియమించింది. పి.రఘురాంను అమికస్ క్యూరీగా నియమిస్తూ నిన్న సాయంత్రం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో చిన్న కేసు వ్యవహారం కాస్తా పెద్ద చిక్కుముడిగా మారిపోయింది. సాధారణంగా సాంకేతిక అంశాలు, ఐటీ విషయాలు, అసాదారణ విషయాలు కేసులో ఉన్నప్పుడు వాటిపై న్యాయమూర్తులకు కూడా అవగాహన ఉండదు కాబట్టి కోర్టు సహాయకులను (అమికస్ క్యూరీ)ని నియమిస్తారు. కానీ ఇప్పుడు కొడాలి కేసులో అమికస్ క్యూరీ నియామకం వెనుక మంత్రి చెబుతున్న వాక్ స్వాతంత్ర హక్కును తేల్చేందుకు నియమించారు.
మంత్రులు, ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై హైకోర్టు సీరియస్
ఏపీలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేషే కుమార్ తీసుకున్న చర్యలను సవాల్ చేస్తూ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్జి, కొడాలి నాని, ఎమ్మెల్యే జోగి రమేష్ వేసిన మూడు పిటిషన్లు వారం రోజుల్లోనే తమ దృష్టికి రావడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ సందర్భంగా వాక్ స్వాతంత్రానికి పరిమితులు లేవా అని ప్రతివాదులను ప్రశ్నించింది. వాక్ స్వాతంత్రం ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతుందని ప్రశ్నించింది. అసలు వాక్ స్వాతంత్రం పరిధులు, పరిమితులు తేల్చేందుకు అమికస్ క్యూరీని నియమించడంతో ఈ వ్యవహారం మరింత రచ్చకావడం ఖాయంగా కనిపిస్తోంది. కొడాలి కేసులో వచ్చే తీర్పు వర్తింప చేస్తే మిగతా వారికి కూడా కష్టాలు తప్పకపోవచ్చు.