శోభానాగిరెడ్డి పేరు తొలగింపుకి నో: కోర్టు తీర్పు ప్రకారమే
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి పేరును బ్యాలెట్ పేపర్ నుండి తొలగించేందుకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు నిరాకరించింది. ఆళ్లగడ్డ ఎన్నికల ఫళితాలు కోర్టు వెలువరించే తుది తర్పుకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది.
ఇందుకు సంబంధించి హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు న్యాయమర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎ శంకరనారాయణతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. బ్యాలెట్ పేపర్ నుండి శోభా నాగిరెడ్డి పేరును తొలగించాలని కర్నూలు జిల్లాకు చెందిన హర్షవర్ధన్ రెడ్డి, వినోద్ కుమార్ రెడ్డిలు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పైన విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి... ఈవిఎంల నుండి శోభా నాగిరెడ్డి పేరు తొలగించేందుకు నిరాకరించింది. అయితే, తుది తీర్పునకు లోబడి ఆళ్లగడ్డ ఫలితం ఉంటుందని చెబుతూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా, శోభా నాగిరెడ్డి గత నెల 24వ తేదిన కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఆ తర్వాతి రోజు ఆమె హైదరాబాదులోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శోభా.... వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున ఆళ్లగడ్డ అసెంబ్లీ బరిలో ఉన్నారు.