అశ్వనీదత్ పిటిషన్పై హైకోర్టులో కీలక విచారణ- ప్రభుత్వం కౌంటర్లకు ఆదేశాలు...
గన్నవరం విమానాశ్రయానికి భూములిచ్చిన కేసులో టాలీవుడ్ నిర్మాణ అశ్వనీదత్ దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. భూసేకరణ చట్టం ప్రకారం తనకు నష్టపరిహారం చెల్లించాలని అశ్వనీదత్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది.
గన్నవరంలో తన భూములు తీసుకున్న ప్రభుత్వం రాజధానిగా ఉన్న అమరావతిలో ప్రత్యామ్నాయ భూములు ఇచ్చిందని, ఇప్పుడు రాజధాని తరలింపు వల్ల తనకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందంటూ అశ్వనీదత్ పిటిషన్లో పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం రాజధాని కాంట్రాక్టు నుచి వైదొలగి తనకు నష్టం చేసిందని అశ్వనీదత్ దంపతులు ఈ పిటిషన్లో ఆరోపించారు. ఏడాదిగా అమరావతిలో అశ్వనీదత్ భూములకు లీజు కూడా చెల్లించలేదని న్యాయవాది జంధ్యాల రవిశంకర్ న్యాయస్ధానం దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ చర్యల వల్ల తన పిటిషనర్కు నష్టం జరుగుతోందని తెలిపారు.
అమరావతిలో భూముల కేటాయింపు, ఇతర అంశాలపై వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం... కౌంటర్లు దాఖలు చేయాలని రెవెన్యూ, మున్సిపల్, సీఆర్డీయే అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణకు నవంబర్ 3కు వాయిదా వేసింది. ఇదే వ్యవహారంలో రెబెల్ స్టార్ కృష్ణంరాజు కూడా దాదాపు ఇదే విధమైన పిటిషన్ దాఖలు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరంలో తమ భూములను విమానాశ్రయ విస్తరణలో భాగంగా ప్రభుత్వానికి అప్పగించిన వీరికి.. చంద్రబాబు అమరావతిలో ప్లాట్లు కేటాయించారు.