నిమ్మగడ్డకు సహాయనిరాకరణ- హైకోర్టు కీలక ఆదేశం- కోర్టుకు తాజా, మాజీ సీఎస్లు
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వం చెప్పినట్లు విని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్కు సహకరించని వ్యవహారంలో ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, మాజీ సీఎస్ నీలం సాహ్నీ ఇరుక్కున్నారు. నిమ్మగడ్డ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు వీరిద్దరినీ తమ ముందు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది.
ఏపీ సర్కార్ స్ధానిక సంస్ధల ఎన్నికల విషయంలో తనకు సహకరించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ గతంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు అప్పట్లో ప్రభుత్వం ఎన్నికల విషయంలో ఎస్ఈసీకి సహకరించాల్సిందేనని ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధంగా లేకపోవడం, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయడం వంటి కారణాలతో అధికారులు కూడా ఎస్ఈసీకి సహకరించలేదు. దీంతో ఆయన కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు.
నిమ్మగడ్డ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ను దాదాపు 40 రోజుల తర్వాత విచారణకు స్వీకరించిన హైకోర్టు... ఆలస్యంగా పిటిషన్ రిజిస్టర్ కావడం వెనుక కారణాలపైనా విచారణ జరుపుతోంది. అదే సమయంలో ప్రభుత్వం ఎస్ఈసీ ఆదేశాలను పాటించకపోవడానికి కారకులైన సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, అప్పటి సీఎస్ నీలం సాహ్నీలను ప్రతివాదులుగా చేర్చింది. దీంతో వీరిద్దరి వివరణ కోరేందుకు వచ్చే నెల 22న హైకోర్టుకు హాజరుకావాలని ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇప్పటికే పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసిపోవడం, వచ్చే నెల 14తో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కూడా ముగియనున్న నేపథ్యంలో హైకోర్టు విచారణతో ఎస్ఈసీకి ఎలాంటి ఉపయోగం లేకుండా పోతోంది.