పంచాయతీ ఎన్నికల పిటిషన్ వాయిదా- సుప్రీం తీర్పు నేపథ్యంలో హైకోర్టు నిర్ణయం
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై కాసేపట్లో సుప్రీంకోర్టు విచారణ జరిపి తీర్పు వెలువరించే అవకాశముంది. వీరి కంటే ముందే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన కేవియట్ పిటిషన్నూ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేష్ రాయ్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పరిగణనలోకి తీసుకోనుంది.
అదే సమయంలో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అక్కడే మరో పిటిషన్ దాఖలైంది. గుంటూరుకు చెందిన ఓ విద్యార్ధిని నిన్న హైకోర్టులో ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ లంచ్ మోషన్లో ఈ పిటిషన్పై విచారణ జరపాలని హైకోర్టును అభ్యర్ధించారు. అయితే ముందుగానే ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు... దీనిపై రేపు విచారణ జరుపుతామని ప్రకటించింది.
ఆర్టికల్ 326 ప్రకారం 18 ఏళ్లు నిండిన వారికి ఓటుహక్కు కల్పించాలని రాజ్యాంగం చెబుతోందని, కానీ ఇప్పుడు ఎస్ఈసీ ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో తాజాగా ఓటర్ల జాబితాలో నమోదైన 3.6 లక్షల మంది యువతీయువకులు ఓటుహక్కు కోల్పోతారని పిటిషనర్ వాదిస్తున్నారు. కాబట్టి ఎన్నికలను వాయిదా వేయాలని ఈ పిటిషన్ వేశారు. కానీ సుప్రీంకోర్టు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలా వద్దా అనే విషయంలో కీలక తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో ఈ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది.