కాల్ మనీ సెక్స్ రాకెట్: వంగవీటి రాధా మేనమామకు హైకోర్టులో చుక్కెదురు
విజయవాడ: రాష్టవ్య్రాప్తంగా సంచలనం కలిగించిన కాల్మనీ సెక్స్రాకెట్ కేసులో నిందితుడు చెన్నుపాటి శ్రీను ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. విజయవాడలో కాల్మనీ మాటున మహిళల పట్ల లైంగిక చర్యలకు పాల్పడిన ఆరోపణలపై మాచవరం పోలీసులు ఏడుగురు నిందితులపై అత్యాచారం, చీటింగ్, ఇతర కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు పటమటకు చెందిన కాల్మనీ వ్యాపారి యలమంచిలి రామ్మూర్తి అలియాస్ రాము, భవానీశంకర్, మాజీ ఎమ్మెల్యే చెన్నుపాటి రత్నకుమారి సోదరుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా మేనమామ అయిన చెన్నుపాటి శ్రీనివాసరావు అలియాస్ శ్రీను, ట్రాన్స్కో డివిజనల్ ఇంజనీరు ఎం సత్యానందం, వెనిగళ్ళ శ్రీకాంత్, పెండ్యాల శ్రీకాంత్, దూడల రాజేష్లను నిందితులుగా చేర్చారు.
వీరిలో ఇప్పటికే రాము, భవానీశంకర్, సత్యానందం, పెండ్యాల శ్రీకాంత్, దూడల రాజేష్లను పోలీసులు అరెస్టు చేయగా ప్రస్తుతం జైలులో రిమాండు అనుభవిస్తున్నారు. ఇక మిగిలిన ఇద్దరు చెన్నుపాటి శ్రీను, వెనిగళ్ళ శ్రీకాంత్లు నెల రోజులకు పైగా పరారీలో ఉన్నారు. పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న చెన్నుపాటి శ్రీను అరెస్టు నుంచి తప్పించుకునేందుకు హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.
ఈ క్రమంలో వాదనల అనంతరం బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ న్యాయమూర్తి గురువారం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. దీంతో చెన్నుపాటి శ్రీను పోలీసుల ఎదుట లేదా కింద కోర్టులో లొంగిపోక తప్పదని తెలుస్తోంది. కాగా ఇదే కేసులో ప్రధాన నిందితుడైన యలమంచిలి రాముపై మాచవరం పోలీస్టేషన్లో రౌడీషీటు తెరిచారు.
అదేవిధంగా ఈకేసులో నాలుగో నిందితుడైన ఎలక్ట్రికల్ డిఇ సత్యానందంకు గతంలో హైకోర్టు జారీ చేసిన ముందస్తు బెయిల్పై పోలీసులు సవాల్ చేయగా ఇటీవల సుప్రీం కోర్టు స్టే విధించింది. దీంతో సెక్స్రాకెట్ కేసులో సత్యానందంను పిటి వారెంట్పై గురువారం మాచవరం పోలీసులు అరెస్టు చేసి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు హాజరుపరిచారు.
దీంతో న్యాయమూర్తి ఈనెల 12వరకు రిమాండ్ విధించగా తిరిగి జిల్లా జైలుకు తరలించారు. ప్రస్తుతం సత్యానందం చీటింగ్, ఫోర్జరీకి సంబంధించి రెండు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ రిమాండ్ అనుభవిస్తున్నాడు.