తేలని ఏపీ పంచాయతీ పోరు- వ్యాక్సినేషన్ వివరాలు కోరిన హైకోర్టు- అది తేలితేనే
ఏపీలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గినా రెండు రోజుల నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో పలు ప్రభుత్వ విభాగాలకు చెందిన ఉద్యోగులు పాల్గొంటున్నారు. దీంతో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని గతంలో ప్రభుత్వం హైకర్టుకు తెలిపింది. దీంతో కరోనా వ్యాక్సినేషన్ షెడ్యూల్పై మరిన్ని వివరాలు కావాలని హైకోర్టు కోరింది.
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణను సస్పెండ్ చేస్తూ గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టు ఫుల్బెంచ్ను ఆశ్రయించారు. సంక్రాంతి సెలవుల తర్వాత ఇవాళ హైకోర్టు ఈ కేసును విచారించింది. కరోనా వ్యాక్సినేషన్ కారణంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. ఇప్పటికే కేంద్రం సూచనలకు అనుగుణంగా వ్యాక్సినేషన్ కొనసాగుతుందన్నారు.
ప్రభుత్వ వాదనలు విన్న ధర్మాసనం.. వ్యాక్సినేషన్కు ఏమైనా ప్రత్యేక షెడ్యూల్ ఇచ్చారా, ఎప్పటివరకూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది, రోజుకు ఎంతమందికి టీకా వేస్తున్నారు, ఇందులో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై తమ వద్ద అందుబాటులో ఉన్న వివరాలను ప్రభుత్వ న్యాయవాదులు సమర్పించారు. మిగతా వివరాలు కూడా ఇవ్వాలని ఆదేశాలు ఇస్తూ హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. కరోనా వ్యాక్సినేషన్పై క్లారిటీ వచ్చాకే పంచాయతీ షెడ్యూల్పై హైకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశముంది.