రేషన్ వాహనాలపై పట్టు వీడని నిమ్మగడ్డ- సింగిల్ జడ్డి తీర్పుపై డివిజన్ బెంచ్లో సవాల్
ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. దీని తర్వాత మున్సిపల్ ఎన్నికలు కూడా ఉన్నాయి. మార్చి 14తో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగియబోతోంది. అయితే మార్చి 15 వరకూ వైసీపీ రంగులతో కూడిన రేషన్ పంపిణీ వాహనాలను రాష్ట్రంలో తిప్పుకునేందుకు హైకోర్టు సింగిల్ బెంచ్ అనుమతి ఇచ్చింది. కానీ విపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై ఎస్ఈసీ నిమ్మగడ్డ హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు.
ఏపీలో మార్చి 15 వరకూ వైసీపీ రంగులతో కూడిన రేషన్ పంపిణీ వాహనాలను తిప్పకుండా ఆపొద్దంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు సమంజసంగా లేదని ఎస్ఈసీ నిమ్మగడ్డ భావిస్తున్నారు. మార్చి 14తో ఎలాగో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. ఆ తర్వాత రేషన్ పంపిణీ వాహనాలు తిప్పుకున్నా ఎవరికీ నష్టం లేదు. కానీ ఎన్నికల వరకూ వాహనాలు ఆపొద్దని, ఆ తర్వాత మీ ఇష్టమంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై విపక్షాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు ఎస్ఈసీకి ఫిర్యాదులు చేస్తున్నాయి.
వైసీపీ రంగులతో కూడిన రేషన్ పంపిణీ వాహనాలను మార్చి 15 వరకూ ఆపొద్దంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్లో అప్పీలు కోసం ఆన్లైన్లో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆఫ్లైన్లో ఇవాళ పిటిషన్ వేస్తే విచారణ చేపడతామంటూ హైకోర్టు తెలిపింది. దీంతో ఇవాళ నేరుగానే పిటిషన్ దాఖలు చేయనున్నారు. దీన్ని అత్యవసరంగా విచారించాలని ఎస్ఈసీ కోరడంతో ఇవాళే విచారించేందుకు హైకోర్టు సిద్ధమైంది.