ఆయనే ఏపీ బీజేపి సీఎం అభ్యర్థి..! ఆంధ్రలో జెట్ స్పీడుతో దూసుకెళ్తున్న కమలం పార్టీ..!!
అమరావతి/హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది. దేశ వ్యాప్తంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపి అవతరించడంతో బీజేపియేతర రాష్ట్రాలపై దృష్టి సారించింది. అవకాశం ఉన్న చోట అదికారంలోకి రావడం, అవకాశం లేని చోట సంస్థాగతంగా బలోపేతం అవ్వడంపై లోతైన కసరత్తు చేస్తోంది. అందుకోసం దక్షిణ భారతదేశంలో రెండు తెలుగు రాష్ట్రాలను పావుగా వాడుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుని ఊపుమీదున్న బీజేపి అదే ఉత్సాహాన్ని ఆంద్రప్రదేశ్ లో కొనసాగించాలని భావిస్తోంది. అందుకోసం బలమైన నేతలను బీజేపిలో చేర్చకుని వచ్చే ఎన్నికల నాటికి అదికారం చేజిక్కించుకునే విధంగా ప్రణాళిక రచిస్తోంది. ఏపిలో ముఖ్య నేతలను చేర్చుకోవడమే కాకుండా ముఖ్యమంత్రి అభ్యర్థి అన్వేషణలో ఉంది బీజేపి. అదే కోణంలో ఆ మాజీ సీఎంను ఏపి బీజేపి అభ్యర్థిగా రంగంలోకి దించేందుకు కసరత్తు చేస్తోంది బీజేపి అదిష్టానం.
Recommended Video
ఏపి రాజకీయల్లో చురుగ్గా పావులు కదుపుతున్న బీజేపి..! అదికారమే లక్ష్యంగా దూకుడు..!!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి సీఎం కిరణ్కుమార్రెడ్డి అనూహ్యంగా రాజకీయాలకు దూరమయ్యారు. పార్టీ పెట్టి దారుణ ఓటమి చవి చూసిన ఆయన స్వయంగా చిరునామా గల్లంతు చేసుకున్నారు. నామ మాత్రంగా నైనా కిరణ్ కుమార్ రెడ్డి బయట కనిపించడం మానేశారు. ఏదో కొన్ని ఆవిష్కరణలు, శుభకార్యాల్లో మాత్రమే ఆయన కనిపిస్తున్నారు. చాలాకాలం తర్వాత మళ్లీ కాంగ్రెస్ లో చేరినా పార్టీకి సంబంధం లేకుండా కాలం వెళ్ల దీస్తున్నారు. 2019 ఎన్నికల ముందు యాక్టివ్ అవుతారు అనుకున్నా, ఎక్కడా ఆయనకు అవకాశం కనిపించకపోవడంతోపాటు సరైన వేదిక దొరకక పోవడంతో మళ్లీ రాజకీయ అజ్జాతంలోకి వెళ్లిపోయారు.
దూకుడు స్వభావం కలిగిన నల్లారి..! కమలం కావాలనుకుంటోంది ఏరికోరి..!!
తాజాగా ఆయన బీజేపీలో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇవేమీ గాసిప్స్ కాదు. ఏపీలో కీలకంగా ఎదగాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీ ఆయనకు గాలం వేస్తోంది. ఈ విషయం పై స్వయంగా బీజేపీ నేతే స్పష్టత ఇస్తున్నారు. ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ ఊహించని నేతలు పార్టీలోకి వస్తున్నారని, ఈ జాబితాలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారని వెల్లడించారు. నల్లారి కిరణ్ బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారని, త్వరలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయని సంచలన ప్రకటన చేసారు మాధవ్.
ఏపిలో నిలదొక్కువాలని పట్టుదలతో ఉన్న బీజేపి..! బలమైన నేలకు గాలం..!!
రాష్ట్ర విభజన నేపథ్యంలో మరో మూడు నెలలు పదవీకాలం ఉండగానే అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డి తన పదవికి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి అప్పట్లో సంచలనం సృష్టించారు. తెలంగాణ ఏర్పాటును కిరణ్ పూర్తిగా వ్యతిరేకించారు. సమైక్యాంధ్ర కోసం ముఖ్యమంత్రి పదవినే త్యాగం చేశారు నల్లారి కిరణ్. అప్పటి పరిణామాల నేపథ్యంలో అతని మాటలపై జనానికి అంత విశ్వసనీయత కలగలేదు. దీంతో తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్, ఏపీలో తెలుగుదేశం అధికారాన్ని చేపట్టాయి. చివరకు కిరణ్ సొంత నియోజకవర్గం పీలేరులో ఓడిపోయారు. ఇది ఆయన్ను బాగా హర్ట్ చేసింది. దీంతో ఆయనకు రాజకీయాల మీద పూర్తిగా ఆసక్తి తగ్గిపోయినట్టు తెలిసింది.
సీఎం అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి..! మారనున్న రాజకీయ సమీకరణాలు..!!
అయితే, ఇపుడు ఏపీలో బీజేపీకి సరైన సీఎం అభ్యర్థి లేకపోవడం, మోడీ సమర్థతపై అందరికీ గురి కుదరడం వల్ల ఏపీలో బీజేపీ ఎదగొచ్చని కొందరు నేతలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సీఎంగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో సీఎం అభ్యర్థిగా కాబోతున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కిరణ్ లా అండ్ ఆర్డర్ లో చాలా పేరు తెచ్చుకున్నారు. ఎవరినీ లెక్కచేయలేదు. అందరూ భయపడే ఎంఐఎం ను జైల్లో కూర్చోబెట్టారు కిరణ్. మొత్తానికి ఆయన ఒక రకంగా ఈ యాంగిల్లో బీజేపీకి కనెక్టయ్యారేమో అనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే, ఇదే అంశంపై మాజీ సీఎం స్వయంగా ప్రకటన చేసే అవకాశాలు లేకపోలేదు. అయితే అందుకు ఇంకా సమయం ఉన్నట్టు ఆయన అనుచరుల ద్వారా తెలుస్తోంది.