అలా అయిపోయింది నా బతుకు.. ఆయనే లేకపోతే సూసైడ్ చేసుకునేవాడిని : 30 ఇయర్స్ పృథ్వీ
మాజీ ఎస్వీబీసీ ఛైర్మన్,టాలీవుడ్లో 30 ఇయర్స్ ఇండస్ట్రీగా పేరు తెచ్చుకున్న పృథ్వీ ఇటీవల తనను కుదిపేసిన ఫోన్ కాల్ సంభాషణపై ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ ఫోన్ కాల్ ఫేక్ అని.. అందులో తనను మద్యం సేవించినవాడిగా చిత్రీకరించారని అన్నారు. కానీ తాను మద్యం మానేసి ఏడాది కాలం పైనే అయిందని స్పష్టం చేశారు. కావాలనే తనను టార్గెట్ చేసి ఇందులో ఇరికిరించారని ఆరోపించారు. తాను ఎస్వీబీసీలో ఉండటం కొందరికి ఇష్టం లేదని.. అందుకే తనను బయటకు పంపించేందుకు కుట్ర జరిగిందని ఆరోపించారు.
అలా అయిపోయింది బతుకు..
ఒక నిబద్దతగల కార్యకర్తగా పార్టీ కోసం పనిచేశానని పృథ్వీ అన్నారు. ఆరోజు జరిగినదానికి తన జీవితం రోడ్డుపాలైందని.. అందరూ బాగానే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోకిరి సినిమాలో కొంతమంది విలన్లు ఇలియానా ఇంటికొచ్చి ఆమెను అల్లరి చేసి పోయే సన్నివేశాన్ని ఇంటర్వ్యూలో పృథ్వీ గుర్తుచేశారు. హీరోయిన్ను అల్లరి చేసి.. ఇప్పుడు నీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారో చూస్తామని తల్లిని బెదిరించి వెళ్లిపోయే సన్నివేశం ఉంటుందని చెప్పారు. తన బతుకు కూడా అలానే అయిపోయిందన్నారు. ఆ సీన్లో ఏమీ చేయకుండానే హీరోయిన్పై రేప్ చేసినట్టు చిత్రీకరించారని.. ఇక్కడ కూడా తానేమీ చేయకుండానే తనను విలన్గా చిత్రీకరించారని చెప్పుకొచ్చారు.
ఫోన్ మిస్ యూస్ చేశారు..
ఎస్వీబీసీలో పనిచేస్తున్నప్పుడు తన ఫోన్లు ఎప్పుడూ తన వద్ద ఉండేవి కాదన్నారు. అసిస్టెంట్స్ వద్దే ఫోన్లు ఉండేవని.. ఏ ఫోన్ వచ్చినా వారే మాట్లాడుతుండేవారని చెప్పారు. తన ఫోన్ను మిస్ యూజ్ చేశారని ఆరోపించారు. ఎస్వీబీసీ తిరుపతి కార్యాలయంలో ముగ్గురు మేకప్ మెన్లు ఉండేవారని.. పనిచేయమని అడిగితే వాళ్లు తనపై ఆగ్రహం పెంచుకునేవారని చెప్పారు. కొన్ని నెలలు హైదరాబాద్ ఆఫీస్లో పనిచేయమని చెబితే.. అక్కడికి పంపించకుండా కొంతమంది వైసీపీ నేతల నుంచి ఫోన్లు చేయించారని చెప్పారు. కొన్నాళ్ల తర్వాత మళ్లీ తిరుపతికే తీసుకొద్దామని చెప్పానని.. కానీ సదరు మేకప్మెన్ అప్పటికే లేబర్ ఆఫీస్లో ఫిర్యాదు చేశాడని చెప్పారు.
సీఈవో కూడా వ్యతిరేకంగా పనిచేశారు..
ఎస్వీబీసీ సీఈవో కూడా తనకు వ్యతిరేకంగా పనిచేశారని పృథ్వీ ఆరోపించారు. అంతా కలిసి తన కడుపు మీద,జీవితం కొట్టారని అని వాపోయారు. అన్నింటికీ వెంకటేశ్వరస్వామే జడ్జి అని.. ఆయన వారికి తగిన శిక్ష విధిస్తాడని అన్నారు. తాను మొండివాడిని కాబట్టి.. ఇంత జరిగినా దిగమింగుకోవడానికే ప్రయత్నిస్తున్నానని చెప్పారు. కానీ ఆ ఘటన జరిగినప్పటి నుంచి మనసు మనసులో లేదన్నారు. మానసికంగా కుంగిపోయానని.. ఇటీవల బాల్కనీ నుంచి కిందపడితే ఎడమ చెయ్యికి ఫ్రాక్చర్ అయిందని చెప్పారు. కానీ అందరికీ షూటింగ్లో గాయమైందని చెబుతున్నానన్నారు.
Recommended Video
ఆయనే లేకపోతే సూసైడ్ చేసుకునేవాన్ని
సినీ ఇండస్ట్రీ పెద్దలతో సైద్ధాంతికంగా విభేదించానని.. దాని వల్ల తాను చాలా సినిమాలు కోల్పోయానని అన్నారు. సినిమా రంగంలో ఎవరైనా గొప్ప వ్యక్తి ఉన్నారా? అంటే చిరంజీవి గారే అన్నారు. అలాగని మిగతావారిని తాను తక్కువ చేసి మాట్లాడలేదన్నారు. తాను మానసికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, తనకు వేషాలు ఇచ్చి ప్రోత్సహించాలని చెప్పిన వ్యక్తి చిరంజీవి అని గుర్తుచేసుకున్నారు. ఆయన లేకపోతే తాను సూసైడ్ కూడా చేసుకునేవాడినని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల పట్ల తానెప్పుడూ అసభ్యంగా ప్రవర్తించలేదన్నారు. తన పేరుతో లీకైన ఫోన్ కాల్ సంభాషణలో ఆ మహిళ ఎవరో ఇంతవరకూ తెలియలేదన్నారు. అసలు ఆ మహిళే లేదన్నారు. ఎస్వీబీసీలో పనిచేస్తున్న మహిళలెవరూ తాము కాదని చెప్పారన్నారు. కాబట్టి తనపై కుట్రతోనే ఇదంతా జరిగిందని.. కావాలనే ఇరికించారని ఆరోపించారు.