బాబు నాతో చెప్పారు కానీ, నిధుల లెక్క అడిగినందుకే, కాంగ్రెస్ దోస్తీకి 4 కారణాలు: గుంటూరులో మోడీ
గుంటూరు: 'భారత్ మాతా కీ జై.. అక్షరక్రమంలో, అన్ని రంగాల్లో, అంశాలలో అగ్రగాములైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు. పద్మభూషణ్, దళితరత్నం గుర్రం జాషువా జన్మించిన గుంటూరు జిల్లా ప్రజలకు నమస్కారం. మహాకవి తిక్కన్న జన్మించిన గుంటూరు జిల్లా ప్రజలకు నమస్కారం.' అని ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. గుంటూరు జిల్లాలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.
నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారు.. ఏపీ ఆక్స్ఫర్డ్
మీరు నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారని అన్నారు. వావిలాల గోపాలకృష్ణయ్యకు వందనాలు అన్నారు. ఎంతోమంది ప్రముఖులను అందించిన ఘనత గుంటూరు జిల్లాది అన్నారు. గుంటూరు సమీపంలోని అమరావతికి ఎంతో చరిత్ర ఉందన్నారు. ఆధ్యాత్మిక చిత్రపటంలో గుంటూరుకు ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పారు. ఈ ప్రాంతానికి ఓ సంస్కృతి ఉందని, దేశానికే ఉదాహరణగా నిలుస్తుందన్నారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ ఆక్స్ఫర్డ్ అన్నారు. అమరావతిని హెరిటేజ్ సిటీగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. పెట్రోలియం రంగంలో ఇబ్బందులు తలెత్తకుండా వ్యూహాత్మక నిల్వలు అని చెప్పారు. ప్రాజెక్టుల వల్ల స్థానికంగా యువతకు ఉపాధి కలుగుతుందని చెప్పారు. మీరు చూపిస్తున్న ప్రేమ నిరంతరం పనిచేసే ప్రేరణ ఇస్తోందన్నారు. 2014కు ముందు గ్యాస్ కనెక్షన్లు కేవలం 55 శాతం మందికి మాత్రమే ఉండేవని, ఇప్పుడు 90 శాతానికి పెరిగిందని చెప్పారు.
ఏపీ రూపు మార్చుతానని చంద్రబాబు నాతో చెప్పారు కానీ
నేను ఏపీకి సన్ రైజ్ వంటి వాడినని చంద్రబాబు తనతో చెప్పారని, కానీ తన కొడుకు రాజకీయ అభివృద్ధికి ఆయన పని చేస్తున్నట్లుగా కనిపిస్తోందని ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. ఏపీని మౌలికసదుపాయాల రాష్ట్రంగా మారుస్తానని చెప్పారని, కానీ అతను యూటర్న్ సీఎంగా తయారయ్యారని విమర్శించారు.
నన్ను తిడితూ ఏపీని మరిచిపోయాడు
తనను తిట్టేందుకు పోటీపడుతున్న నేతల్లో చంద్రబాబు కలిశారని ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. తనను తిట్టేవారి జాబితాలో చేరి ఏపీ అభివృద్ధిని, ఇక్కడి వికాసాన్ని పూర్తిగా విస్మరించారన్నారు. నేను ఇచ్చిన నిధులకు, పథకాలకు స్టిక్కర్ అంటించే కార్యక్రమాన్ని చంద్రబాబు చేస్తున్నారన్నారు. చంద్రబాబు తనపై తిట్లను పక్కన పెట్టి, నిధులను ఏం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలన్నారు.
కాంగ్రెస్ దుష్ట పార్టీ అంటే, చంద్రబాబు వారితో దోస్తీ చేస్తున్నారు
కాంగ్రెస్ పార్టీని నాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు దుష్ట కాంగ్రెస్గా అభివర్ణిస్తే, చంద్రబాబు దోస్తీ కాంగ్రెస్ అంటున్నారని ప్రధాని మోడీ అన్నారు. చంద్రబాబు తీరు చూసి ఎన్టీఆర్ ఆత్మఘోషిస్తుందని వాపోయారు. ఏపీలో కాంగ్రెస్ ముక్త్ కోసం ఎన్టీఆర్ ప్రయత్నాలు చేశారన్నారు. ఎన్టీఆర్ను తీవ్రంగా అవమానించిన కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు ఎందుకు కలిశారో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్టీఆర్ను అవమానించిన విషయం అందరికీ తెలుసునని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు మీపై ఉన్న ఒత్తిడి ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు గతం మరిచి మాట్లాడుతున్నారన్నారు.
నన్ను తిట్టేందుకు చంద్రబాబుకు 4 కారణాలు
చంద్రబాబు ఎన్డీయేను వీడిడానికి ప్రధానంగా నాలుగు కారణాలు ఉన్నాయని ప్రధాని మోడీ చెప్పారు. చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసి గెలిచిన సందర్భాలు లేవని, అందుకే ఇప్పుడు తమపై బురద జల్లి కాంగ్రెస్ పార్టీతో జత కట్టారని చెప్పారు. రెండోది తమ కొడుకు నారా లోకేష్ను రాజకీయాల్లో పైకి తీసుకు వచ్చేందుకు, మూడోది తక్కువ కాలంలో తన (చంద్రబాబు) సంపాదన అన్నారు. నాలుగో కారణం.. నేను దేశం కోసం వాచ్మన్లా పని చేస్తున్నానని, దీంతో కేంద్రం నుంచి వచ్చిన నిధులకు లెక్క చెప్పమని అడిగానని, ఆ లెక్కలు చెప్పేందుకు భయపడి పారిపోయారని, ఆయనకు గతంలో లెక్కలు చెప్పే అలవాటు లేనట్లుగా ఉందని, అందుకే అవినీతిపరులతో ఆయన కలిశారన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు తనను టార్గెట్ చేశారన్నారు.
నాకు ధనార్జన తెలియదు నిజమే
మహాకూటమి అపవిత్ర కలయిక అని మోడీ అన్నారు. ఆ అపవిత్ర కూటమిలో చంద్రబాబు చేరుతున్నారన్నారు. ఈ మహాకూటమి క్లబ్ అన్నారు. ఈ క్లబ్లో దేశ ప్రజలకు అన్యాయం, మోసం చేసిన వారు ఉన్నారని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఉన్నారని చెప్పారు. నరేంద్ర మోడీకి.. ధనార్జన ఎలా చేయాలో తెలియదని ఇటీవల చంద్రబాబు చెప్పారని, అది నిజమేనని తనకు తెలియదని అన్నారు. ఎందుకంటే నేను వాచ్మెన్లా ప్రశ్నలు అడిగే తత్వం ఉన్న వ్యక్తిని అని చెప్పారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులకు లెక్క చెప్పమంటే విపక్షాలతో కలిసి ఢిల్లీకి వెళ్లి ఫోటోలు తీయించుకోవడానికి ఆయన వెళ్తున్నారని చెప్పారు. అందర్నీ సమానంగా చూడాలని ప్రజలు మనలని ఎన్నుకున్నారని, కానీ మన అమ్మాయి, మన కొడుకు గురించి చూడవద్దన్నారు. చంద్రబాబుకు ఏవో ఇబ్బందులు ఉన్నాయని, వాటి నుంచి తప్పించుకోవడానికి తమపై ఆరోపణలు చేస్తున్నారన్నారు.