కచ్చులూరులో తలలేని మొండెం... బోటు వెలికితీతకు కొనసాగుతున్న యత్నాలు
తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద మరో మృతదేహం బయట బయటపడింది. అయితే తలలేని మొండెంతో మృతదేహం ఉండడంతో అధికారులు దాన్ని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. లభించిన మృతదేహం బోటు ప్రమాదంలో మృతి చెందిన వారిదా లేక ఇతర ప్రాంతం నుండి కొట్టుకు వచ్చిందా అనేది తెలియాల్సి ఉంది. కాగా గత నాలుగు రోజులుగా బోటు వెలికితీతలో భాగంగా సత్యం బృందం చేస్తున్న ప్రయత్నాల్లో బోటు కదిలించడంతో నలబై మీటర్ల లోతులోకి వచ్చినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే బోటులోనే చిక్కుకున్న మృతదేహాలు పైకి తేలుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కచ్చులూరు.. మృత్యు మలుపు: తెలిసి.. తెలిసీ మృత్యుముఖంలోకి !
ఆక్సిజన్ మాస్క్లతో బోటు వద్దకు వెళ్లిన గజఈతగాళ్లు
మరోవైపు ప్రమాదంలో చిక్కుకున్న బోటును బయటకు తీసేందుకు శనివారం బ్రేక్ వేసిన సత్యం బృందం ఆదివారం సైతం మరోసారి తన ప్రయత్నాలు కొనసాగిస్తోంది. బోటు ఉన్న ప్రాంతానికి ఆక్సిజన్ సిలిండర్లతో గజ ఈతగాళ్లు వెళ్లారు. అనంతరం అక్కడి పరిస్థితి చూసిన అనంతరం బయటకు వచ్చి అధికారులతో బృందానికి వివరించారు. దీంతో మరికొద్ది గంటల్లో బోటును వెలికి తీసే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.
చిక్కినట్టే చిక్కి జారీపోతున్న బోటు
సత్యం బృందం రెండవ దఫా బోటును వెలికి తీసేందుకు నాలుగు రోజులుగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాల్లో బోటు లంగరుకు చిక్కినట్టే చిక్కి తిరిగి నీళ్లలోకి జారీ పోతుంది. దీంతో మూడవరోజు చేసిన ప్రయత్నాల్లో బోటు రెయిలింగ్ ఊడి వచ్చిన పరిస్థితి కనిపించింది. మరోవైపు 50 అడుగుల లోతులో బోటు ఉన్నట్టు సత్యం బృందం సభ్యులు చెబుతున్నారు. దీంతో పూర్తిస్థాయిలో లంగరు వేసి, తాళ్లతో బిగిస్తే తప్ప పూర్తిగా బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
నెల రోజులుగా ప్రయత్నాలు
సెప్టెంబర్ 15న జరిగిన బోటు ప్రమాద సమయంలో 8 మంది సిబ్బందితో పాటు ముగ్గురు పిల్లలు సహా మొత్తం 75 మంది ఉన్నాట్లు అధికారులు ప్రకటించారు. వీరిలో 26 మంది ప్రాణాలతో బయటపడగా.. ఇప్పటి వరకు 38 మృతదేహాలను బయటకు తీశారు. కాగా మరో 11 మంది ఆచూకీ తెలియలేదు. బోటులోనే వారి డెడ్బాడీలు చిక్కుకొని ఉంటాయని అంచనా వేస్తున్నారు. దీంతో సత్యం బృందం బోటును వెలికి తీస్తే కాని మృతదేహాల జాడపై స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు. మొత్తం మీద మరో రెండు రోజుల్లో ఫలితం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.