ఏలూరులో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి, కేంద్రానికి నారా లోకేశ్ లేఖ, జగన్ సర్కార్పై నిప్పులు..
ఏలూరు ఘటన ఏపీకి అట్టుడికిస్తోంది. వింత వ్యాధి సోకిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 400కి పైగా మంది జబ్బు పడగా.. వారికి ఏమైందో తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే వారిలో కొందరు కోలుకోవడం కాస్త సానుకూల అంశం. దీనిని సీరియస్గా తీసుకోవాలని విపక్ష టీడీపీ కోరుతోంది. సీఎం జగన్ పట్టనట్టు వ్యవహారిస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. ఒకడుగు ముందుకేసిన నారా లోకేశ్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని కోరారు.
తక్షణమే స్పందించండి..
ఏలూరులో పరిస్థితి దిగజారుతోందని నారా లోకేశ్ అన్నారు. ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించాలని కోరారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ కూడా రాశారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్షన్ కు లేఖ రాశానని ట్వీట్ చేశారు. ఏలూరులో వందల మంది అస్వస్థతకు గురవుతున్నారని లోకేశ్ చెప్పారు. వారికి సోకిన వ్యాధిని గుర్తించి, నయం చేయాలని కోరారు. వందల మంది వింత వ్యాధి బారినపడినా.. రాష్ట్ర ప్రభుత్వం సరిగా స్పందించడం లేదని ఆరోపించారు. ఏలూరు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు.
పట్టించుకోని సర్కార్..
ఏలూరు ప్రజల ఆరోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని లోకేశ్ విరుచుకుపడ్డారు. వ్యాధి ఏంటో చెప్పకుండా.. హిస్టిరియా అంటూ ప్రచారం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. దీనిపై వెంటనే కేంద్రం జోక్యం కలుగజేసుకోవాలని కోరారు. ఆలస్యం చేస్తే మరింత మంది జబ్బున పడే అవకాశం ఉందన్నారు. ఇంత జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదన్నారు.
400 మందికి పైగా..
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వన్టౌన్ పరిధిలో అస్వస్థతకు గురవుతున్న బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శనివారం రాత్రి నుంచి ఇప్పటివరకు 400కి పైగా మంది అనారోగ్యంతో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. వారిలో 127 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా.. మిగతావారు చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన బాధితులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా ఎవరికీ వైరస్ నిర్ధారణ కాలేదని అధికారులు స్పష్టం చేశారు.
వింత జబ్బు
ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలోనే కాకుండా స్థానిక ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ మరో వంద మందికిపైగా బాధితులు చికిత్స పొందుతున్నారని విశ్వసనీయంగా తెలిసింది. వైద్య పరీక్షలు నిర్వహించగా.. అన్నింటిలోనూ నార్మల్ వచ్చిందని వైద్యులు తెలిపారు. వైరల్, బ్యాక్టీరియా, కొవిడ్, సిటీ స్కాన్, నీటి నాణ్యత లాంటి అన్ని పరీక్షలు నిర్వహించినా వ్యాధి నిర్ధారణకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లభించలేదని అధికారులు వెల్లడించారు.