ఇకపై ఎపిలో నకిలీ,కల్తీ మందులకు నో ఛాన్స్ ;ప్రతి జిల్లాకు డ్రగ్ టెస్ట్ సెంటర్: మంత్రి కామినేని
విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో ఇకపై నకిలీ మందులు మార్కెట్లో ప్రవేశించకుండా అణచివేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. విజయవాడలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నకిలి,కల్తీ మందులు కనిపెట్టి నిరోధించేందుకు ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున ముప్పై లక్షల రూపాయల ఖరీదైన డ్రగ్ టెస్టు పరికరాన్ని త్వరలోనే అందజేయనున్నట్టు మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. అలాగే అన్ని మందులను నేరుగా తయారీ యూనిట్ నుంచి దుకాణం చేరే వరకు వాటిని ఆన్ లైన్ లో ట్రాక్ చేయనున్నామని, త్వరలోనే ఇందుకోసం రాష్ట్రంలో సమగ్ర మందుల ట్రాకింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్టు మంత్రి కామినేని చెప్పారు.
అలాగే రాష్ట్రంలో వైద్య సేవలకు సంబంధించి విప్లవాత్మకమైన మార్పులు చేపట్టనున్నట్లు మంత్రి కామినేని తెలిపారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవలను మరింత విస్తరించేందుకు ఈ పథకం కింద శస్త్రచికిత్సలు చేయించుకున్న అనంతరం, సంబంధిత పేషంట్లకు వైద్య పరీక్షల నిమిత్తం గ్రామాల్లోనే సింగిల్ డాక్టరు క్లినిక్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు.