రాజధాని పిటీషన్లపై విచారణ: హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వ మూడు రాజధానులు ఏర్పాటు, రాజధాని తరలింపుపై హైకోర్టులో వేసిన రాజధాని రైతులు వేసిన పిటిషన్లపై నేడు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. అమరావతిలో రాజధాని నిర్మాణానికి సంబంధించిన నిధుల వ్యయంపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజధాని నిర్మాణానికి ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారు? ఆ నిర్మాణాలు ఎక్కడ వరకు వచ్చాయి? తదితర వివరాలన్నీ కోర్టుకు అందించాలని ఆదేశించింది. ఇప్పటి వరకూ 52 వేల కోట్ల రూపాయల వ్యయం రాజధాని నిర్మాణం కోసం చేశారని హైకోర్టు న్యాయవాది సిఆర్డిఏ రికార్డును ముందుంచారు.
అమరావతిలో నిర్మాణం కోసం వెచ్చించిన సొమ్ము అంతా ప్రజల సొమ్ము అని, రాష్ట్ర ఖజానాకు నష్టమే కదా అంటూ త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాదు రాజధాని అమరావతిలో ఇప్పటివరకు ఎన్ని బిల్డింగ్ లు నిర్మించారు? ఎన్ని పూర్తయ్యాయి? పూర్తికాని బిల్డింగులు ఎక్కడ ఆగిపోయాయి? వాటికి అయిన వ్యయం ఎంత? కాంట్రాక్టర్లు ఎవరు? ఇంకా వారికి ఎంత డబ్బు చెల్లించాలి? వంటి అన్ని వివరాలను వెంటనే సమర్పించాలని త్రిసభ్య ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Recommended Video
అంతేకాదు రాజధాని అమరావతి లోని భవనాల నిర్మాణానికి డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయి? 52 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఏ దశలో ఉన్నాయి? ఖర్చుల వివరాలు అన్ని తమకు సమర్పించాలని ఆదేశించింది. నిర్మించిన భవనాలను వాడుకోకపోతే, అవి శిథిలావస్థకు చేరుకుంటాయి కదా.. ఆ నష్టం ఎవరు భరిస్తారు అంటూ హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఇక ఈ వ్యవహారంలో రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ కు వెంటనే నోటీసులు ఇవ్వాలని ఆదేశించిన హైకోర్టు ఈ కేసు విచారణను తిరిగి ఆగస్టు 14వ తేదీకి వాయిదా వేసింది.