అమిత్ షా పర్యటనలతో వేడెక్కుతున్న ఏపి రాజకీయం.! టీడిపి-బీజేపిల మధ్య మాటల యుద్ధం.!!
అమరావతి/ హైదరాబాద్ : బీజేపి జాతీయ అద్యక్షుడు అమీత్ అమీత్ షా ఏపీ పర్యటనకు వచ్చినప్పుడల్లా రాజకీయాలు వెడెక్కుతున్నాయి. భారత ప్రధానిపై విశ్వాసం లేకుండా మాట్లాడుతున్నానని, పాకిస్తాన్ ప్రధానిని విశ్వసిస్తున్నానని తనపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మండిపడ్డారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలను సీయం తీవ్రంగా ఖండించారు. ఆ వ్యాఖ్యలు తాను చేసినట్లుగా ఆధారాలు చూపించాలని చంద్రబాబు సవాల్ విసిరారు. సైనికుల చావులను టీడీపీ, టీఎంసీ, కాంగ్రెస్ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని అమిత్ షా అనడమే నీచ రాజకీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వైపు వాళ్ళు నీచ రాజకీయాలు చేస్తూ ఆ బురద తమకు అంటించాలని చూడటం అతినీచమన్నారు చంద్రబాబు.
అమిత్ షా వ్యాఖ్యలను ఖండించిన బాబు..! క్షమాపణ చెప్పాలని డిమాండ్..!!
తాము దేశం కోసం మాట్లాడితే బీజేపి నేతలు రాజకీయం కోసం మాట్లాడుతున్నారని, ఉగ్రదాడి మన గడ్డమీద జరిగిందని, అది ఇంటలిజెన్స్ వైఫల్యం వల్ల జరిగిన దుర్ఘటన కాదా బీజేపి సమాధానం చెపస్పాలని చంద్రబాబు నిలదీసారు. 2013లో బీహార్ లో, కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడులపై అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాలని గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోది చేసిన వ్యాఖ్యలు మీకు దేశద్రోహంగా కనిపించలేదా..? అప్పుడు నరేంద్రమోది చేసిన వ్యాఖ్యలు వీడియో క్లిప్పింగ్ లు చెక్ చేసుకోవాలని చంద్రబాబు అమీత్ షాకు సూచించారు.
అగ్గికి ఆజ్యం పోస్తున్న అమీత్ షా పర్యటన..! టీడిపి-బీజెపి ల మద్య ముదురుతున్న వివాదం..!!
అంతే కాకుండా దేశ భద్రత ప్రధాని చేతుల్లో ఉన్నప్పుడు ఉగ్రవాదులకు హవాలా మార్గంలో డబ్బులు ఎలా అందుతున్నాయని, ఉగ్రవాదులను నిలువరించే నిగ్రహం ప్రధానికి లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఉగ్రదాడులు ఇంత పెద్ద యెత్తున జరుగుతున్నప్పుడు ఎందుకు ప్రధాని రాజీనామా చేయరని నిలదీసారు. 2013లో ఇదే ఉగ్ర దాడి జరిగినప్పుడు ఇదే నరేంద్రమోది 5ప్రశ్నలు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు వేశారని, ఈ అంశమే తాను గుర్తు చేశానని చంద్రబాబు స్పష్టం చేసారు.
మోదీ రాజీనామా చేయాలి..! కాశ్మీర్ ఘటన నిఘా వైఫల్యమే నన్న బాబు..!!
ఇప్పుడీ ఉగ్రదాడికి బాధ్యతగా ప్రధాని పదవికి నరేంద్రమోది రాజీనామా చేస్తారా అని ప్రశ్నించాను. దానికి బిజెపి నేతలకు ఇంత ఉలికిపాటు ఎందుకో అర్ధం కావడం లేదన్నారు. నరేంద్రమోది మాట్లాడితే దేశభక్తి ఉన్నట్లు..? నేను మాట్లాడితే దేశభక్తి లేనట్లా..? మీరు చేస్తే గొప్ప రాజకీయం,మేము చేస్తే నీచ రాజకీయమా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. దేశభక్తి గురించి, దేశభద్రత గురించి అమిత్ షా ద్వారా పాఠాలు చెప్పించుకునే స్థితిలో నేనని, రక్తంలో దేశభక్తి అని చెప్పేవాళ్లే రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్ల కుంభకోణం ద్వారా దేశ ప్రతిష్టను జాతీయంగా, అంతర్జాతీయంగా దెబ్బతీశారని ఘాటుగా విమర్శించారు.
జాతికి బీజెపి క్షమాపణ చెప్పాలి..! అమీత్ షా చౌకబారు రాజకీయాలు మానాలన్న బాబు..!!
ఒకవైపు 42మంది జవాన్ల మృతి దేశాన్ని కదిలించివేస్తే, ప్రజల హృదయాలను గాయపరిస్తే, ప్రధాని నరేంద్రమోది ఎక్కడ ఉన్నారని, ఏం చేస్తున్నారని, తనకేమీ పట్టనట్లు డిస్కవరీ ఛానల్ షూటింగ్ లో 3గంటలు గడిపినట్లు మీడియాలో వచ్చినదానిపై జాతికి ఏం సమాధానం చెబుతారని బాబు నిలదీశారు చంద్రబాబు. ఇకనైనా బిజెపి నేతలు తనపై చేస్తున్న అర్ధరహితమైన విమర్శలను, దుష్ప్రచారాన్ని కట్టిపెట్టాలని హితవు పలికారు బాబు. చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకుని దేశానికి క్షమాపణలు చెప్పాలని చంద్రబాబు అమీత్ షా ను డిమాండ్ చేశారు.